ఉద్యోగులను సంతోషపరిచేందుకు చాలా కంపెనీలు బోనస్లు, ట్రిప్లు, బహుమతులు ఇస్తుంటాయి. అయితే ఒక చైనీస్ టెక్ కంపెనీ మాత్రం పూర్తిగా భిన్నంగా ఆలోచించింది. ఉద్యోగుల ఆరోగ్యంపై దృష్టి సారించింది. ఉద్యోగులను ఫిట్గా, ఆరోగ్యంగా మార్చాలని సంకల్పించింది. దీంతో ఉద్యోగులకు ఓ వినూత్న ఆఫర్ను అందించింది. షెన్జెన్లోని అరాషి విజన్ ఇంక్ అనే సంస్థ బరువు తగ్గే ఛాలెంజ్ను ప్రారంభించింది (Company weight loss bonus).
ఆ సంస్థ తన మిలియన్ యువాన్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో భాగంగా బరువు తగ్గినందుకు ఉద్యోగులకు సుమారు 1.23 కోట్ల రూపాయల బహుమతిని ఇచ్చింది. ఈ ఛాలెంజ్ కోసం కొన్ని ప్రత్యేకమైన రూల్స్ను కూడా ప్రవేశపెట్టింది. ఈ ఛాలెంజ్లో సంస్థకు చెందిన ప్రతి ఉద్యోగీ పాల్గొనవచ్చు. 0.5 కిలోల బరువు తగ్గిన ఏ ఉద్యోగికైనా 500 యువాన్లు (సుమారు రూ. 6,100) లభిస్తాయి. అయితే బరువు తగ్గి బహుమతి అందుకున్న ఏ ఉద్యోగి అయినా తిరిగి బరువు పెరిగితే జరిమానాగా 800 యువాన్లు (సుమారు రూ. 9,800) చెల్లించాలి (Company gives money for losing weight).
ఈ ఛాలెంజ్లో పాల్గొన్న జీ యాకీ అనే ఉద్యోగి 90 రోజుల్లో 20 కిలోల బరువు తగ్గింది (Unique employee rewards). దీంతో ఆమెకు దాదాపు 2.47 లక్షల రూపాయల బహుమతి లభించింది. కాగా, ఈ ఏడాదిలో విజన్ ఇంక్ సంస్థకు చెందిన 99 మంది ఉద్యోగులు మొత్తం 950 కిలోల బరువును తగ్గించుకున్నారు. దీంతో సదరు సంస్థ ఉద్యోగులందరికీ కలిపి ఏకంగా 1.23 కోట్ల రూపాయలను బహుమతిగా అందించింది. తమ ఉద్యోగులు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటే పనితనం మెరుగుపడుతుందని సంస్థ యాజమాన్యం భావిస్తోంది.
































