అమెరికా వీసా నిబంధనల్లో పెద్ద మార్పులు.. భారతీయ దరఖాస్తుదారులకు కొత్త సవాళ్లు

అమెరికా విదేశాంగ శాఖ.. వలసేతర వీసా (Non-Immigrant Visa Interview Update) దరఖాస్తుదారుల కోసం ఒక ముఖ్యమైన అప్డేట్ను విడుదల చేసింది.


ఇంటర్వ్యూ అపాయింట్మెంట్లను షెడ్యూల్ చేసే నిబంధనలను మరింత కఠినతరం చేసింది. కొత్త ఆదేశాల ప్రకారం… దరఖాస్తుదారులు ఇప్పుడు తమ పౌరసత్వం లేదా చట్టపరమైన నివాసం ఉన్న దేశంలో ఉన్న US ఎంబసీ లేదా కాన్సులేట్లోనే తమ వీసా ఇంటర్వ్యూలు బుక్ చేసుకోవాలని (US consulate interview rules Indians) సూచించింది. సెప్టెంబర్ 6వ తేదీన ఈ మార్పును అనౌన్స్ చేశారు.

కోవిడ్-19 మహమ్మారి సమయంలో ప్రయాణికులు తమ స్వదేశంలో ఎక్కువ సమయం తీసుకునే ఇంటర్వ్యూ స్లాట్లను విదేశాల్లో కంప్లీట్ చేసుకునేవారు. ఇప్పుడు ఆ విధానానికి ముగింపు పడింది. అంటే భారతీయ దరఖాస్తుదారులు ఇకపై ఇతర దేశాలలో వేగంగా B1 (వ్యాపారం) లేదా B2 (పర్యాటక) వీసా స్లాట్లను ఫినిష్ చేయలేరు. అంటే స్వదేశంలోనే స్లాట్ చేసుకుని ఆలస్యమైన వీసా ఇంటర్వ్యూల్లో పాల్గొనాల్సి వస్తుంది. తరచుగా ప్రయాణించేవారికి, బిజినెస్ ఎక్స్​పర్ట్స్​కి ఈ అప్డేట్ వల్ల సమయం వృథా అవుతుంది.

భారతీయ దరఖాస్తుదారులకు..

భారతీయ పౌరులకు ఒక్కో కొత్త విధానం ఒక్కో కొత్త సవాలును ఇస్తుంది. ఎందుకంటే B1/B2 వీసా ఇంటర్వ్యూల (B1/B2 Visa Interview Changes India) కోసం ప్రస్తుత నిరీక్షణ సమయం (Indian Applicants US Visa Wait Time) చాలా ఎక్కువగానే ఉంది. హైదరాబాద్, ముంబైలలో మూడున్నర నెలలు, ఢిల్లీలో నాలుగున్నర నెలలు, కోల్కతాలో ఐదు నెలలు, చెన్నైలో దాదాపు తొమ్మిది నెలల నిరీక్షణ ఉంది. విదేశాలలో అపాయింట్మెంట్లను పొందే అవకాశం ఇప్పుడు మూసివేశారు కాబట్టి.. భారతీయ దరఖాస్తుదారులు స్థానిక కాన్సులేట్లపై మాత్రమే ఆధారపడవలసి ఉంటుంది. ఇప్పటికే ఒత్తిడికి గురవుతున్న భారతదేశ వ్యవస్థపై ఇది మరింత ఒత్తిడిని పెంచనుందని నిపుణులు భావిస్తున్నారు.

మరోవైపు US సాధారణ NIV కార్యకలాపాలను నిర్వహించని దేశాలకు ఈ నియమం వర్తించదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అదనంగా కొంతమంది ప్రయాణికులు ఇప్పటికీ ఇంటర్వ్యూ మినహాయింపులకు అర్హత పొందవచ్చని తెలిపింది. ఉదాహరణకు.. గడువు ముగిసిన 12 నెలల్లోపు B-1, B-2 లేదా B1/B2 వీసాను పునరుద్ధరించే వారు, మునుపటి వీసా 18 ఏళ్లు దాటినప్పుడు వంటి సందర్భాల్లో మినహాయింపు పొందొచ్చు.

ఇంటర్వ్యూ మినహాయింపు మార్పులు

షెడ్యూలింగ్ మార్పులతో పాటు US భద్రతా తనిఖీలను బలోపేతం చేయడానికి తన ఇంటర్వ్యూ మినహాయింపు కార్యక్రమాన్ని కూడా సవరించింది. దీనిలో భాగంగా 14 ఏళ్లలోపు పిల్లలు నుంచి 79 ఏళ్లు పైబడిన పెద్దలు సహా చాలా మంది దరఖాస్తుదారులు కాన్సులర్ అధికారి చేసే వ్యక్తిగతమైన ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంది. A, G, NATO వీసాలు వంటి దౌత్య, అధికారిక వర్గాలకు కొన్ని మినహాయింపులు ఉన్నప్పటికీ.. విస్తృత మార్పు మరింత కఠినమైన స్క్రీనింగ్ను ఇండికేట్ చేస్తుంది.

ఫీజుల్లో కూడా మార్పులే

మార్పుల్లో భాగంగా US 2026 నుంచి అమలులోకి వచ్చే $250 వీసా ఇంటిగ్రిటీ ఫీజును ప్రవేశపెట్టింది. ఈ ఫీజు ద్రవ్యోల్బణానికి అనుసంధానమై భద్రతా డిపాజిట్గా పనిచేస్తుంది. వీసా హోల్డర్లు అన్ని షరతులకు అనుగుణంగా ఉంటే తిరిగి చెల్లించవచ్చు. ట్రంప్ పరిపాలన కఠినమైన తనిఖీ చర్యలతో కలిపి.. ఈ మార్పులు సరిహద్దు భద్రత, జాతీయ భద్రతను బలోపేతం చేయాలనే వాషింగ్టన్ ఉద్దేశాన్ని ప్రతిబింబిస్తున్నాయి. భారతీయ ప్రయాణికులు, విద్యార్థులు, తాత్కాలికంగా వర్క్ కోసం వెళ్లేవారికి ఈ మార్పుల వల్ల ఎక్కువ ఆలస్యం అవుతుంది. అలాగే కఠినమైన తనిఖీలకు దారి తీయవచ్చు. కాబట్టి దరఖాస్తులను ముందుగానే ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.