స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో కీలక నిర్ణయం తీసుకుంది. తమ ఖాతాదారులకు అదిరే శుభవార్త అందించింది. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో ఆటో స్వీప్ గరిష్ఠ పరిమితిని పెంచింది.
ఈ నిర్ణయం ఎస్బీఐలో ఖాతా ఉన్న వారికి అదనపు రాబడి అందుకునేందుకు అవకాశం కల్పిస్తుందని చెప్పవచ్చు. పొదుపు ఖాతాలని డబ్బులకు అదనపు వడ్డీ పొందేందుకు ఇది ఒక మంచి మార్గంగా చెప్పవచ్చు. ప్రస్తుతం ఎస్బీఐ ఆటో స్వీప్ అకౌంట్ గరిష్ఠ లిమిట్ రూ. 35 వేలుగా ఉండగా దానిని రూ. 50 వేలకు పెంచుతున్నట్లు తాజాగా ప్రకటించింది. దీంతో ఒక్కోసారి రూ. 50 వేల వరకు ఆటో స్వీప్ చేస్తూ అదనపు వడ్డీ పొందవచ్చు.
ఈ మేరకు తమ ఖాతాదారులకు ఇ- మెయిల్స్ ద్వారా సమాచారం అందిస్తోంది ఎస్బీఐ. ‘సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లలో ఆటో స్వీప్ ఫెసిలిటీ మినమ్ త్రిషోల్డ్ పరిమితిని రూ. 35 వేల నుంచి రూ. 50 వేలకు పెంచుతున్నట్లు తెలియజేస్తున్నాం. దీంతో తదుపరి MOD( మల్టీ ఆప్షన్ డిపాజిట్) పరిమితి రూ. 50 వేలుగా ఉంటుంది’ అని ఖాతాదారులకు మెసేజ్ పంపించింది. అలాగే సోషల్ మీడియా ఎక్స్ అకౌంట్ వేదికగాను ఓ పోస్ట్ చేసింది.
‘మీ డబ్బులను సేవింగ్స్ అకౌంట్ లేదా ఫిక్స్డ్ డిపాజిట్లలో ఎందుకు మార్చుతారు? మల్టీ ఆప్షన్ డిపాజిట్ స్కీమ్ ద్వారా ఆ రెండింటిని ఆటోమేటిక్గా చేయవచ్చు. అలాగే అధిక రిటర్న్స్ పూర్తి యాక్సస్ పొందవచ్చు. ఈరోజే ప్రారంభించండి. మీ సమీపంలోని ఎస్బీఐ బ్రాంచుకు వెళ్లండి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా లాగిన్ అయి పూర్తి చేయండి. ఈ స్కీమ్ శాలరీ అకౌంట్, ఎన్ఆర్ఐ, వెల్త్ కస్టమర్లకూ వర్తిస్తుంది.’ అని తెలియజేసింది.
ఎస్బీఐ ఆటో స్వీప్ స్కీమ్ ఏంటి?
ఎస్బీఐ మల్టీ ఆప్షన్ డిపాజిట్ (MOD) స్కీమ్ ద్వారా కస్టమర్లు సేవింగ్స్ అకౌంట్ ద్వారానే అధిక వడ్డీ పొందవచ్చు. ఎంఓడీ స్కీమ్ ద్వారా సేవింగ్స్ ఖాతాలోని అదనపు డబ్బులు ఆటోమేటిక్ గా ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాలోకి వెళ్తాయి. దీంతో అధిక వడ్డీ వస్తుంది. ఒక వేళ సేవింగ్స్ ఖాతాలో సరిపడా బ్యాలెన్స్ లేకపోతే బ్యాంకు ఆటోమేటిక్గా ఎంఓడీ నుంచి డబ్బులను పొదుపు ఖాతాలో జమ చేస్తుంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ జమ చేస్తారు. ఇందులో కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే వడ్డీపైన వడ్డీ వస్తుంది. గడువు కన్నా ముందుగా తీసుకుంటే పెనాల్టీ పడుతుందని గమనించాలి.
































