జీఎస్టీ బొనాంజా.. రూ.3.87 లక్షలకే స్విఫ్ట్‌ కొత్త కారు

దిగ్గజ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ కార్లపై ధరలను తగ్గించినట్లు ప్రకటించింది. వస్తు సేవల పన్ను జీఎస్టీ 2.0 సంస్కరణల నేపథ్యంలో కొత్త రేట్లు సెప్టెంబర్ 22, 2025 నుంచే అమలులోకి వస్తున్నాయి.


తమ కుటుంబం కోసం బడ్జెట్ ధరలో కొత్త కారు కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు. మారుతీ సుజుకీలో అత్యంత ఆదరణ పొందిన కార్లపై భారీ తగ్గింపు ఇస్తోంది. దేశంలో అత్యంత ఆదరణ ఉన్న హ్యాచ్ బ్యాక్ మోడల్ కారు స్విఫ్ట్ పై ఏకంగా రూ.1.06 లక్షల వరకు తగ్గించినట్లు తెలిపింది. ఇక ఎంట్రీ లెవెల్ కారుపై రూ.55 వేల వరకు తగ్గింపు లభిస్తున్నట్లు వెల్లడించింది. ఈ కారు ప్రారంభ ధర రూ.5.94 లక్షలు (ఎక్స్ షోరూమ్) గా ఉంది.

రూ.3.87 లక్షలకే కొత్త కారు

మారుతీ సుజుకీ కంపెనీలో కుటుంబం కోసం బడ్జెట్ ధరలో కొనుగోలు చేయాలనుకునే వారికి ముందుగా గుర్తుకు వచ్చేది మారుతీ సుజుకీ ఆల్టో. కొత్త జీఎస్టీ ధరల ప్రకారం ఆల్టో కే10 మోడల్‌పై రూ.53 వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఎంట్రీ లెవెల్ మోడల్ ఆల్టో కారుపై రూ.28 వేల వరకు తగ్గింపు లభిస్తోంది. దీంతో ఈ కారు కేవలం రూ.3.87 లక్షలకే లభిస్తుంది. హైఎండ్ వేరియంట్ కారు ధర రూ.5.36 లక్షలకే లభిస్తోంది.

ఇక మారుతీ సుజుకీ ఎస్ ప్రెస్సో కారు రూ.3.90 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా ఉంది. ఈ కారుపై గరిష్ఠంగా రూ.53 వేలు డిస్కౌంట్ లభిస్తోంది. మారుతీ సుజుకీ వ్యాగన్ ఆర్ కారుపై రూ.64 వేల తగ్గింపు లభిస్తోంది. సెలెరియా కారుపై రూ.63 వేలు డిస్కౌంట్ లభిస్తుంది. స్విఫ్ట్ డిజైర్ ధర గరిష్ఠంగా రూ.87 వేలు తగ్గనుంది. ఈ మోడల్ ధర రూ.6.24 లక్షల నుంచి మొదలవుతోంది. మారుతీ సుజుకీ బలెనో కారుపై రూ.85 వేల వరకు తగ్గింపు వస్తోంది.

వస్తు సేవల పన్ను జీఎస్టీ కౌన్సిల్ 56వ సమావేశం సెప్టెంబర్ 3వ తేదీన జరిగింది. ఇందులో జీఎస్టీ రేట్లను తగ్గించారు. ఇప్పుడు 1500 సీసీ డీజిల్ కార్లు, 1200 సీసీ పెట్రోల్ కార్లపై జీఎస్టీ భారీగా తగ్గింది. దీంతో కార్ల కంపెనీలు తమ మోడల్ కార్లపై ధరలు తగ్గిస్తున్నాయి. ఇప్పటికే టాటా, హ్యూందాయ్, హోండా, మారుతీ సుజుకీ వంటి దిగ్గజ కంపెనీలన్నీ ధరల తగ్గింపు ప్రకటనలు చేశాయి. భారత్‌లో ఎక్కువగా ఆదరణ పొందుతోన్న చిన్న కార్లు చాలా తక్కువ ధరకే వస్తున్నాయి. ఫ్యామిలీ కోసం కొనేందుకు ఇదే మంచి అవకాశంగా చెప్పవచ్చు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.