ఏపీలో 60 ఏళ్ల పురుషులు, 58 ఏళ్ల మహిళలకు శుభవార్త.. పూర్తిగా ఉచితం, కేవలం 10 నిమిషాల్లో తీసుకోవచ్చు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేంద్రం సహకారంతో వృద్ధుల కోసం సీనియర్ సిటిజన్ కార్డుల్ని జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 60 ఏళ్లు పైబడిన మగవారికి, 58 ఏళ్లు నిండిన మహిళలకు సీనియర్ సిటిజన్ కార్డులు ఇస్తోంది.


ఈ కార్డు ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అయితే చాలా మందికి దీని గురించి సరిగా తెలియక ముందుకు రావట్లేదు. గ్రామ, వార్డు సచివాలయాల్లో, మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే ఈ కార్డు ఇస్తారు. మొన్నటి వరకు కొన్ని సాంకేతిక సమస్యలు, సర్వర్ సమస్యలు కారణంగా కార్డుల్ని జారీ చేయలేదు.. వాటి పరిష్కరించి మళ్లీ కార్డులు జారీ చేస్తున్నారు. అర్హులైన వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ సీనియర్‌ సిటిజన్‌ కార్డులు జారీ చేస్తారు. అలాగే మీసేవా కేంద్రాల్లో కూడా తీసుకోవచ్చు. ఈ కార్డులు కావాలంటే.. పురుషులు అయితే 60 ఏళ్లు, మహిళల అయితే 58 ఏళ్లు నిండి ఉండాలి. ఈ సీనియర్ సిటిజన్ కార్డు కోసం ఆధార్, బ్యాంకు అకౌంట్ కాపీ, పాస్‌పోర్టు సైజు ఫొటో, వయసు ధృవీకరణ పత్రం, బ్లడ్ గ్రూప్, అడ్రస్ ప్రూఫ్, ఎమర్జెన్సీ కాంటాక్ట్ నంబర్లు వంటి వివరాలతో సచివాలయానికి వెళ్లాలి.. అక్కడ ఈ వివరాలను నమోదు చేసి సీనియర్‌ సిటిజన్‌ కార్డును జారీ చేస్తారు. అయితే సీనియర్ సిటిజన్ కార్డుల ప్రక్రియపై అవగాహన పెంచుతున్నామని గ్రామ, వార్డు సచివాలయాల అధికారులు చెబుతున్నారు.

సీనియర్ సిటిజన్ కార్డు వృద్ధులకు చాలా ఉపయోగపడుతుంది. ఇది సంక్షేమ పథకాలు, ప్రభుత్వ రాయితీలు పొందడానికి సులువు చేస్తుంది. ఈ కార్డు ఉంటే ఇతర గుర్తింపు కార్డులు అంతగా అవసరం లేదు. ఆశ్రమాల్లో సేవలు, ఆర్టీసీ బస్సుల్లో రాయితీ పొందవచ్చు. రైళ్లలో కింది (లోయర్) బెర్తులు ఇస్తారు. కోర్టులు కేసుల విచారణలో ప్రాధాన్యం ఇస్తాయి. బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు ఉంటాయి. సీనియర్ సిటిజన్ కార్డుతో వృద్ధులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే రాయితీలను పొందడానికి ఇది సహాయపడుతుంది. మొన్నటి వరకు సాంకేతి, సర్వర్ సమస్యలతో కార్డులు జారీ చేయలేదు.. ఇప్పుడు అర్హత ఉన్నవాళ్లు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు.

ఏలూరు జిల్లా విషయానికి వస్తే.. మొత్తం 1.32 లక్షల మంది అర్హులు జిల్లాలో ఉన్నట్లు అంచనాల ఉన్నాయి. అయితే ఈ నెల 12 వరకు ఉన్న సమాచారం ప్రకారం.. జిల్లాలోని అన్ని సచివాలయాల ద్వారా ఈ సీనియర్ సిటిజన్ కార్డులు తీసుకున్న వారి సంఖ్య 18,781 మంది (14 శాతం) మాత్రమే ఉంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉందంటున్నారు. అందుకే అర్హులైన వారు వెంటనే ఈ కార్డులు తీసుకోవాలని సూచిస్తున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.