గ్రామీణ ప్రాంత ప్రజల కోసం పోస్ట్ ఆఫీస్ ఆరు రకాల బీమా పథకాలను అమలు చేస్తోంది. తక్కువ ప్రీమియం, ఎక్కువ బోనస్లతో పాలసీదారులకు లాభాల భరోసాను ఇస్తోంది. సురక్ష, సువిధ, సుమంగళ్, సంతోష్, గ్రామప్రియ, చిల్డ్రన్ పాలసీ పేర్లతో ఆరు పథకాలను ప్రవేశపెట్టింది. ఒక్కో పథకం ద్వారా రూ.10 వేల నుంచి రూ.10 లక్షల వరకూ పాలసీలు చేసుకునే అవకాశం కల్పించింది. వీటిలో ఒక్కో పథకానికి బోనస్ను రూ.60లు, రూ.48లు, రూ.45 లు చొప్పున అందించనుంది. లబ్ధిదారుడు మూడేళ్ల పాటు జరిపిన చెల్లింపులపై రుణ సదుపాయం కల్పిస్తోంది. ప్రీమియం చెల్లిస్తున్న సమయంలో పాలసీదారుడు మరణిస్తే వారు కట్టిన పాలసీ మొత్తాన్ని ఒకేసారి నామినీకి అందజేస్తారు.
చిల్డ్రన్ పాలసీ..
ఈ పాలసీలో చేరే పిల్లలకు సంబంధించిన తల్లిదండ్రులు సురక్ష, సువిధ పథకాలలో లబ్ధిదారులై ఉండాలి. ఆయా పథకాల్లో ఉన్న తల్లిదండ్రుల పిల్లలకు మాత్రమే ఈ పథకం వర్తించనుంది. అది కూడా తల్లిదండ్రుల వయస్సు 45 సంవత్సరాలలోపు ఉండాలి. ఈ పథకంలో 5 నుంచి 20 సంవత్సరాలలోపు ఉన్న పిల్లలకు పాలసీ వర్తిస్తుంది. ఈ పథకంలో రూ.20 వేల నుంచి రూ.లక్ష వరకూ పాలసీని నిర్ణయించారు. ఈ పథకంలో బోనస్ రూ.48గా నిర్ణయించారు.
సంతోష్ పథకం..
సంతోష్ పథకం కింద 10 వేల నుంచి రూ.10 లక్షల వరకూ పాలసీలను నిర్ణయించారు. 19 నుంచి 55 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారిని ఈ పథకానికి అర్హులుగా చేర్చారు. ఈ పథకంలో బోనస్ కింద రూ.1000కి రూ.48 వర్తిస్తుంది. ఈ పథకంలో 19 సంవత్సరాల వయస్సు గల లబ్ధిదారుడు పథకంలో చేరితే మెచ్యూరిటీని 35, 40, 45, 50, 55, 58, 60 సంవత్సరాలకు నిర్దేశించుకోవచ్చు. ఇక్కడ మెచ్యూరిటీ ఏ సంవత్సరం వరకు అయితే నిర్దేశించుకుంటారో.. ఆ సంవత్సరం నుంచి మరో ఐదేళ్లపాటు వేచి ఉండాల్సి ఉంటుంది. అనంతరం పాలసీ మొత్తానికి రూ.48 బోనస్ను అదనంగా జోడించి లబ్ధిదారుడికి అందజేస్తారు. రూ.10లక్షలు పాలసీ చేసిన లబ్ధిదారుడికి బోనస్తో కలుపుకొని మొత్తం రూ.29.68 లక్షలు పాలసీ మొత్తం వర్తిస్తుంది. పథకాల్లో చేరదలచిన వారు ఆధార్, పాన్కార్డు కలిగి ఉండాలి. జిల్లాలోని ఏ పోస్టాఫీసులోనైనా ప్రీమియం చెల్లించవచ్చు. ఆదాయపు పన్ను రాయితీ, నామినేషన్ సౌకర్యం, ఆన్లైన్లో ప్రీమియం చెల్లించే అవకాశాన్ని పోస్ట్ ఆఫీస్ కల్పించింది.
సురక్ష పథకం
సురక్ష పథకం కింద రూ.10 వేల నుంచి రూ.10 లక్షల వరకూ పాలసీలను నిర్ణయించారు. 19 నుంచి 55 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారిని ఈ పథకానికి అర్హులుగా చేర్చారు. ఈ పథకంలో బోనస్ కింద రూ.1000కి రూ.60లు వర్తిస్తుంది. 60 సంవత్సరాల వరకూ ప్రీమియం చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. అనంతరం 80 ఏళ్ల తర్వాత రూ. 10 లక్షలు, అందుకు సంబంధించి రూ.60 బోనస్తో కలిపి మెచ్యూరిటీ మొత్తాన్ని లబ్ధిదారుడికి అందజేస్తారు. లబ్ధిదారుడు మరణిస్తే మొత్తాన్ని నామినీకి అందజేస్తారు. రూ.10 లక్షలు పాలసీ 60 సంవత్సరాల పాటు చెల్లిస్తే బోనస్ కలుపుకొని దాదాపు రూ.34.60 లక్షలు లబ్ధిదారుడికి అందుతాయి. మూడేళ్ల తర్వాత పాలసీదారుడికి రుణ సదుపాయం కూడా ఉంటుంది.
గ్రామప్రియ పథకం
ఈ పథకంలో 10 సంవత్సరాల పాలసీ మాత్రమే నిర్ణయించారు. ఇందులో 20 నుంచి 45 సంవత్సరాల వయస్సు గల వారిని అర్హులుగా చేర్చారు. ఈ పథకంలో రూ.45 బోనస్ రూపంలో పాలసీకి వర్తించనుంది. ఈ పథకంలో 10 సంవత్సరాల పాలసీలో మనీబ్యాక్ కింద 4, 7 సంవత్సరాలకొకసారి 20 శాతం బోనస్ లభించనుంది. మిగిలిన మొత్తాన్ని పాలసీ ముగిసే సమయంలో బోనస్ను అదనంగా జోడించి అందించనున్నారు.
సువిధ పథకం
సువిధ పథకం కింద 10 వేల నుంచి రూ. 10 లక్షల వరకూ పాలసీలను నిర్ణయించారు. 19 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారిని ఈ పథకానికి అర్హులుగా చేర్చారు. ఈ పాలసీని సురక్ష పథకంలో మాదిరి 60 సంవత్సరాల వరకూ నిర్ణయించుకోవచ్చు. లేదా సంతోష్ పథకంలో నిబంధనల మేరకు కన్వర్ట్ చేసుకునే అవకాశం కల్పించారు. సురక్ష పథకం కింద ప్రీమియం చెల్లింపులు ఐదేళ్ల పాటు చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత ఒక సంవత్సరంలోపు సంతోష్ పథకం కింద కన్వర్ట్ అయ్యే అవకాశం కల్పించారు. సురక్ష పథకం కింద అయితే రూ. 60లు బోనస్.. సంతోష్ పథకం కింద కన్వర్ట్ చేసుకుంటే రూ.48 బోనస్ లబిస్తుంది. లబ్ధిదారుడి చెల్లింపులు బట్టి బోనస్లు వర్తిస్తాయి.
సుమంగళ్ పథకం
ఈ పథకంలో రూ.10 వేల నుంచి రూ.10 లక్షల వరకూ పాలసీలను నిర్ణయించారు. 19 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారిని ఈ పథకానికి అర్హులుగా చేర్చారు. ఈ పథకంలో రూ. 45లు బోనస్ లభిస్తుంది. పథకంలో రెండు రకాల బోనస్లను నిర్ణయించారు. 15 సంవత్సరాల పాలసీను ఎంచుకున్న లబ్ధిదారుడికి మనీబ్యాక్ కింద 6 సంవత్సరాలకొకసారి, 9 సంవత్సరాలకొకసారి, 12 సంవత్సరాల కొకసారి 20 శాతం మనీ బ్యాక్ రూపంలో బోనస్ లభించనుంది. అనంతరం మిగిలిన బోనస్ని పాలసీ గడువు ముగిసిన అనంతరం అందజేస్తారు. 20 సంవత్సరాల పాలసీని ఎంచుకున్న లబ్ధిదారుడికి మనీ బ్యాక్ కింద 8 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 16 సంవత్సరాలకొకసారి 20 శాతం చొప్పున మనీ బ్యాక్ రూపంలో బోనస్ లభిస్తుంది. ఈ పథకంలో ఎలాంటి రుణ సదుపాయం ఉండదు.
































