రైల్వే ప్రయాణికులకు అలర్ట్‌.. తగ్గిన వాటర్‌ బాటిల్‌ ధర

భారతీయ రైల్వేస్‌ తన ప్రయాణికులకు కాస్త ఉపశమనం కలిగించింది. వాటర్‌ బాటిల్‌ ధరను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. జీఎస్టీ ప్రభావంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.


తగ్గించిన ఈ ధరలు సోమవారం(సెప్టెంబర్‌ 22) తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.

రైల్వే మంత్రిత్వ శాఖ శనివారం విడుదల చేసిన ప్రకటనలో.. F(C) డైరెక్టరేట్ అంగీకారంతో తాగునీటి బాటిళ్ల గరిష్ట చిల్లర ధర (MRP) తగ్గించబడింది. ఈ ధరలు రైల్వే స్టేషన్లు, రైళ్లలో అమ్మకానికి వర్తిస్తాయి. ప్రయాణికులకు తక్కువ ధరలో నాణ్యమైన తాగునీరు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

రైల్‌ నీర్‌ లీటర్‌ బాటిల్‌ ధరను తగ్గించినట్లు ప్రకటించింది. ఇంతకు ముందు అది 15 రూపాయలు ఉండగా.. ఇప్పుడు దానిని 14 రూపాయలుగా మార్చింది. అలాగే.. అర లీటర్‌ బాటిల్‌ ధరను రూ.10 నుంచి రూ.9కి తగ్గించినట్లు తెలిపింది. రైల్‌ నీర్‌ అనేది ప్రభుత్వ నియంత్రణలో.. ఐఆర్‌సీటీసీ ద్వారా సరఫరా అవుతోంది. అయితే ఇతర బ్రాండ్లు మాత్రం మార్కెట్‌ ఆధారంగా రేట్లకే అమ్ముతుంటాయి. అయితే..

రైల్‌ నీర్‌ మాత్రమే కాదు.. ఇతర బ్రాండ్ల వాటర్‌ బాటిల్స్‌ను రైళ్లలో, రైల్వే స్టేషన్‌లలో ఎమ్మార్పీ (బాటిల్‌పై ఉన్న రేటు కంటే ఎక్కువ) అమ్మితే అది నేరమే. వాటర్‌ బాటిల్స్‌ మాత్రమే కాదు.. ఇతర ప్రొడక్టులకూ ఇది వర్తిస్తుంది. ఈ వ్యవహారాన్ని తేలికగా తీసుకోవాల్సిన అవసరం లేదు. నిమిషాల్లోనే ఫిర్యాదు చేసే వీలు ఉంది.

లీగల్‌ మెట్రాలజీ యాక్ట్‌(2009 ప్రకారం).. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధర వసూలు చేయడం నేరం. దీనిపై వినియోగదారుల రక్షణ కట్టం కింద ప్రయాణికులు ఫిర్యాదు చేయొచ్చు. ఇందుకోసం రైల్వే శాఖ IRCTC, Rail Madad వంటివి అందుబాటులో ఉన్నాయి.

రైల్‌ మదద్‌ యాప్‌గానీ, వెబ్‌గానీ(https://railmadad.indianrailways.gov.in) లింక్‌ ఓపెన్‌ చేసి ఓవర్‌ చార్జింగ్‌ ఆఫ్‌ వాటర్‌ బాటిల్‌ “Overcharging of water bottle” అని అంశాన్ని ఎంచుకుని వివరాలు నమోదు చేయండి. అదే ఐఆర్‌సీటీసీలో అయితే వెబ్‌సైట్(https://www.irctc.com) కంప్లయింట్‌ సెక్షన్‌లో ఫిర్యాదు నమోదు చేయొచ్చు. ఈ మార్గాలే కాదు..

COMPLAIN అని టైప్‌ చేసి ఫిర్యాదును పొందుపరిచి అని 139 నెంబర్‌కూ మెసేజ్‌ పంపొచ్చు. ఈ ఫిర్యాదులో.. స్టేషన్ పేరు / రైలు నంబర్, తేదీ, సమయం, అమ్మిన వ్యక్తి పేరు (అందుబాటులో ఉంటే), బాటిల్ ధర.. వసూలు చేసిన ధర, మీ టికెట్ వివరాలు (కంపల్సరీ ఏం కాదు) పొందుపర్చాలి. లేకుంటే నేరుగా స్టేషన్ మాస్టర్, కమర్షియల్ ఇన్‌చార్జ్, లేదంటే టికెట్ చెక్ చేసే సిబ్బంది కూడా ఫిర్యాదు చేయొచ్చు. అలాగే బిల్ లేకుండా అధిక ధర వసూలు చేసినా వెంటనే అధికారులకు తెలియజేయొచ్చు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.