కేంద్ర రవాణా శాఖ పాత వాహనాలకు హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు (HSRP) తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. 2019 మార్చి 31కి ముందు కొనుగోలు చేసిన వాహనదారులు ఈ నెల 30వ తేదీ లోపు ఈ నంబర్ ప్లేట్లను బిగించుకోవాలని గడువు విధించింది.
అయితే చాలామంది వాహనదారులకు ఈ విషయంపై సరైన అవగాహన లేకపోవడం, ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యల కారణంగా నంబర్ ప్లేట్ల బిగింపు ప్రక్రియ ఆశించిన స్థాయిలో జరగటం లేదు.
నకిలీ నంబర్ ప్లేట్లకు అడ్డుకట్ట వేయడం, వాహనాల భద్రతను పెంచడం, నేరాలను నియంత్రించడం వంటి లక్ష్యాలతో కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. హెచ్ఎస్ఆర్పీ నంబర్ ప్లేట్లు దూరం నుంచి కూడా స్పష్టంగా కనిపించేలా.. ప్రత్యేకమైన లేజర్-బ్రాండెడ్ హోలోగ్రామ్, ఇన్ఫ్రారెడ్ లేజర్ నంబర్ వంటి భద్రతా ఫీచర్లతో రూపొందించారు. వాహనం రకం ప్రకారం రూ. 320 నుంచి రూ. 860 వరకు రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
వాహనదారులు www.siam.in లేదా సంబంధిత వెబ్సైట్లో తమ వాహన వివరాలు, వ్యక్తిగత వివరాలు నమోదు చేసి దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్లో అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత, నిర్దేశించిన తేదీన వాహన షోరూంకు వెళ్లి నంబర్ ప్లేట్ బిగించుకోవాలి. అనంతరం ఆన్లైన్లో తిరిగి వివరాలు నమోదు చేయాలి. అయితే, కేంద్రం అమలు చేస్తున్న వాహన సారథి పోర్టల్కు, రాష్ట్ర ప్రభుత్వ రవాణాశాఖ డేటాబేస్కు మధ్య అనుసంధానం సరిగా లేకపోవడం వల్ల సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయని రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు.
హెచ్ఎస్ఆర్పీ నంబర్ ప్లేట్ లేకుండా వాహనాన్ని అమ్మడం లేదా కొనడం, ఆర్.సి (RC) పత్రాలలో పేరు మార్చుకోవడం సాధ్యం కాదు. అంతేకాకుండా బీమా, పొల్యూషన్ ధ్రువపత్రాల జారీ కూడా నిలిచిపోతుంది. నాన్-ట్రాన్స్పోర్టు వాహనాల రిజిస్ట్రేషన్ గడువు 15 ఏళ్లు ఉంటుంది. గడువు ముగిసిన తర్వాత దానిని తప్పనిసరిగా పునరుద్ధరించుకోవాలి. ఈ పని చేయకుండా రోడ్లపై తిరుగుతున్న వాహనాలు ప్రమాదానికి గురైతే బీమా పరిహారం పొందలేరు. 2019 మార్చి 31కి ముందు వాహనాలు కొనుగోలు చేసిన వాహనదారులు వెంటనే అప్రమత్తమై తమ పాత నంబర్ ప్లేట్లను మార్చుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. లేకపోతే భవిష్యత్తులో తీవ్రమైన సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉంది.
































