తెలుగు రాష్ట్రాలకు తొలి వందేభారత్ స్లీపర్ పైన కీలక అప్డేట్. ఎంతో కాలంగా వేచి చూస్తున్న వందేభారత్ స్లీపర్ రైళ్లు దీపావళికి పట్టాలెక్కనున్నాయి. ముందుగా రెండు రైళ్లను ప్రారంభించేలా రైల్వే శాఖ నిర్ణయించింది. దశల వారీగా మిగిలిన రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. అయితే, వందేభారత్ స్లీపర్ ను ప్రాధాన్యతలో తెలుగు రాష్ట్రాలకు కేటాయించేందుకు రైల్వే శాఖ తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రైలు ఏపీ నుంచి అయోధ్య/ వారణాశికి కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రూట్.. షెడ్యూల్ పైన తుది కసరత్తు జరుగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో వందేభారత్ రైళ్లకు ఆదరణ పెరుగుతోంది. విశాఖ – సికింద్రాబాద్, కాచిగూడ – యశ్వంత్ పూర్, విజయవాడ – చెన్నై, సికింద్రాబాద్ – తిరుపతి వందేభారత్ రైళ్లను ఆశించిన స్థాయిలో ఆక్యెపెన్సీ ఉందని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఇక, ఏపీ నుంచి దూరపు ప్రాంతా లకు చేరుకునేందుకు వందేభారత్ స్లీపర్ రైళ్ల కేటాయింపు పైన తెలుగు రాష్ట్రాల ఎంపీల నుంచి రైల్వే శాఖకు పలు ప్రతిపాదనలు అందాయి. అందులో భాగంగా విశాఖ నుంచి తిరుపతి, విశాఖ నుంచి బెంగళూరు కు వందేభారత్ స్లీపర్ కేటాయించాలని ఇప్పటికే ఎంపీలు నేరుగా రైల్వే మంత్రిని కలిసి వితని పత్రాలు సమర్పించారు.
ఇక, విజయవాడ నుంచి బెంగళూరుకు వందేభారత్ కు ఆమోదం వచ్చినా.. నర్సాపురం నుంచి ప్రారంభించాలనే డిమాండ్ పైన తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. విజయవాడ నుంచి చెన్నైకు ప్రస్తుతం వందేభారత్ కొనసాగుతోంది. ఇక.. వందే భారత్ స్లీపర్ కోసం దేశ వ్యాప్తంగా వస్తున్న డిమాండ్ ను పరిగణలోకి తీసుకొని కేటాయింపు లు చేయాలని రైల్వే శాఖ భావిస్తోంది. కానీ, ఇదే సమయంలో ఏపీ నుంచి అయోధ్య, వారణాసి కి వందేభారత్ స్లీపర్ కేటాయింపులో తొలి ప్రాధాన్యత ఇవ్వాలని రైల్వే మంత్రిని ఏపీకి చెందిన కీలక నేతలు కోరారు. ఇందుకు తాజాగా రైల్వే శాఖ నుంచి సానుకూల స్పందన వచ్చింది. దీంతో..ఏపీ నుంచి రెగ్యులర్ రైళ్లల్లో అయోధ్య, వారణాసి వెళ్లే వారికి ప్రయోజన కరంగా ఉండనుంది.
వందేభారత్ స్లీపర్ల కోసం పెద్ద ఎత్తున వినతులు.. డిమాండ్లు పెండింగ్ లో ఉన్నాయి. అయితే, తెలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో భాగంగా విజయవాడ టు అయోధ్య ప్రతిపాదనకు ప్రయార్టీ ఇస్తామని రైల్వే శాఖ హామీ ఇచ్చినట్లు సమాచారం. దీంతో, వందేభారత్ స్లీపర్ రైళ్లు పట్లాలెక్కిన తరువాత విజయవాడ నుంచి అయోధ్య, వారణాసి కి కేటాయింపు పైన తొలి రెండు విడతల్లోనే ప్రకటన ఉంటుందని ముఖ్య నేతలు చెబుతున్నారు. విజయవాడ నుంచి వరంగల్ మీదుగా ప్రస్తుతం రెగ్యులర్ రైళ్లు ప్రయాణించే మార్గంలోనే వందేభారత్ స్లీపర్ ను అయోధ్య కు కేటాయించేలా నిర్ణయం ఉంటుందని తెలుస్తోంది. రాత్రి సమయంలోనే ఈ రైలు ఉండేలా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ రైలు అందుబాటులోకి వస్తే అయోధ్య, వారణాసి వెళ్లాలనుకునే తెలుగు ప్రజలకు వరంగానే భావించాలి.
































