విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై వరుసగా రెండో రోజూ భారీగా ట్రాఫిక్జామ్ ఏర్పడింది. నల్గొండ జిల్లా చిట్యాల నుంచి పెద్దకాపర్తి వరకు సుమారు 4 కిలోమీటర్ల మేర రాకపోకలు స్తంభించిపోయాయి. దీంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. పెద్దకాపర్తి, చిట్యాల వద్ద వంతెన నిర్మాణ పనుల వల్ల ఈ సమస్య ఏర్పడింది. దసరా సెలవుల తర్వాత ప్రయాణికులు నగర బాట పట్టడంతో వాహనాల రద్దీ నెలకొంది. మరోవైపు పంతంగి టోల్ ప్లాజాతో పాటు చౌటుప్పల్, దండు మల్కాపురం వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. పోలీసులు వాహనాల రద్దీని క్రమబద్ధీకరించే ప్రయత్నం చేస్తున్నారు.
హైదరాబాద్లోని ఎల్బీనగర్ చింతలకుంట నుంచి కొత్తపేట వరకు భారీగా ట్రాఫిక్జామ్ ఏర్పడింది. చింతలకుంట పైవంతెనపై ట్రావెల్స్ బస్సులు నిలిచిపోయాయి. ట్రాఫిక్జామ్ కారణంగా కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు.
































