గతంలో అతి తక్కువ ధరకే డేటా ప్లాన్స్ తీసుకొచ్చి టెలికామ్ రంగంలో రిలయన్స్ జియో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత తక్కువ ధరకే జియో ఫోన్ను లాంచ్ చేసింది.
ఇదే బాటలో ఇప్పుడు మరో కొత్త ఫోన్ను మార్కెట్లో విడుదల చేసింది. ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 2025లో రిలయన్స్ జియో అద్భుతమైన కొత్త ఫోన్ను లాంచ్ చేసింది. దీని పేరు జియోభారత్ సేఫ్టీ ఫస్ట్ మొబైల్. కేవలం కాల్స్, మెసేజ్లకే కాకుండా ముఖ్యంగా కుటుంబ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ ఫోన్ను రూపొందించారు. మహిళలు, పిల్లలు, వృద్ధులు వంటి వారికి మెరుగైన కనెక్టివిటీని అందిస్తూనే, వారి భద్రతను నిర్ధారించడం ఈ ఫోన్ ప్రధాన లక్ష్యం.
భద్రతా ఫీచర్లతో ఆందోళనలకు చెక్..
ఇప్పుడున్న సోషల్ మీడియా కాలంలో పెద్దలు, పిల్లలు, మహిళల భద్రత గురించి చాలా ఆందోళన ఉంటుంది. అలాంటి భయాలను తగ్గించడానికి ఈ జియోభారత్ ఫోన్లో సూపర్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి:
లొకేషన్ మానిటరింగ్: మీ కుటుంబ సభ్యులు ఎక్కడున్నారో ఈ ఫోన్ ద్వారా కచ్చితమైన వివరాలను తెలుసుకోవచ్చు.
యూసేజ్ మేనేజర్: ఈ ఫీచర్ ద్వారా మీకు ఎవరెవరు కాల్ చేయాలి, మెసేజ్ చేయాలి అనేది మీరే నిర్ణయించుకోవచ్చు. తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్ను బ్లాక్ చేయొచ్చు.
వాడకం చాలా సులభం: ఈ ఫోన్ చాలా సింపుల్గా ఉంటుంది. అందుకే వృద్ధులు కూడా దీన్ని తేలికగా ఉపయోగించవచ్చు.
జియో ఈ ఫోన్ను ముఖ్యంగా మహిళలు, పిల్లలు, వృద్ధులను రక్షించాలనే లక్ష్యంతో తీసుకొచ్చింది.
బ్యాటరీ లైఫ్ అదుర్స్..
ఈ ఫోన్ గురించి మరో గొప్ప విషయం ఏమిటంటే దాని బ్యాటరీ. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా ఏడు రోజుల వరకు వస్తుంది. అంటే మీరు మీ కుటుంబంతో చాలా ఎక్కువ కాలం కనెక్ట్ అయి ఉండొచ్చు.
ధర ఎంత..? ఎక్కడ కొనాలి..?
అంతేకాకుండా ఈ ఫోన్ ధర కేవలం రూ. 799 మాత్రమే.. ఇంత తక్కువ ధరలో ఇంత మంచి భద్రతా ఫీచర్లతో ఫోన్ రావడం ఇదే మొదటిసారి. దీన్ని మీరు జియో స్టోర్, జియోమార్ట్, అమెజాన్ లేదా స్విగ్గీ ఇన్స్టామార్ట్ నుంచి కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ ప్రతి భారతీయ కుటుంబ భద్రతను మరింత బలోపేతం చేస్తుందని రిలయన్స్ జియో ధీమా వ్యక్తం చేసింది.
































