జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. మొదటి విడత జెడ్పీటీసీ , ఎంపీటీసీ ఎన్నికలకు ఈరోజు (గురువారం) నోటిఫికేషన్‌ను విడుదల చేశారు రిటర్నింగ్ అధికారులు. నేటి నుంచి ఈనెల 11వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాల్లో రెండు విడతలుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగనున్నాయి. మొదటి విడతలో 31 జిల్లాల్లో 58 రెవెన్యూ డివిజన్లు, 292 జెడ్పీటీసీ, 2963 ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్‌లను స్వీకరించనున్నారు.


నామినేషన్‌లు వేసే అభ్యర్థులు కొంత మేర డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. జెడ్పీటీసీ జనరల్ అభ్యర్థి రూ.5000, రిజర్వేషన్ అభ్యర్థి రూ.2,500 డిపాజిట్ చేయాల్సి ఉండగా.. ఎంపీటీసీ నామినేషన్ దాఖలు చేసే జనరల్ అభ్యర్థి రూ.2,500, రిజర్వేషన్ అభ్యర్థి రూ.1,250 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈనెల 23న పోలింగ్ జరుగనుండగా… నవంబర్ 11న కౌంటింగ్ జరుగనుంది.

తొలి విడతలో సిద్ధిపేట జిల్లాలోని సిద్దిపేట, హుస్నాబాద్, గజ్వేల్ డివిజన్ పరిధిలోని 15 జెడ్పీటీసీ, 125 ఎంపీటీసీ స్థానాలకు నేటి నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. మండల పరిషత్ కార్యాలయాల్లో జెడ్పీటీసీ నామినేషన్లను స్వీకరించనుండగా.. ఎంపీటీసీ స్థానాలకు క్లస్టర్ స్థాయిలో నామినేషన్లు స్వీకరించనున్నారు. అలాగే సంగారెడ్డి జిల్లాలో తొలి విడతలో జహీరాబాద్, నారాయణఖేడ్ డివిజన్లలోని 12 జెడ్పీటీసీ, 129 ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు స్వీకరించనున్నారు అధికారులు. మెదక్ జిల్లాలో మెదక్ డివిజన్ పరిధిలోని 10 జెడ్పీటీసీ, 99 ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ జరుగనుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.