చరిత్ర సృష్టించిన టీమిండియా ప్లేయర్‌.. టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ

హారాష్ట్ర బ్యాటర్‌ కిరణ్‌ నవ్‌గిరే(Kiran Navgire) మహిళల టి20 క్రికెట్‌లో కొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. బీసీసీఐ సీనియర్‌ మహిళల టి20 ట్రోఫీ (ఎలైట్‌)లో భాగంగా పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో కిరణ్‌ 34 బంతుల్లోనే సెంచరీ నమోదు చేసింది.


దీంతో మహిళల టీ20 క్రికెట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన బ్యాటర్‌గా నవ్‌గిరే నిలిచింది.

ఇంతకుముందు ఈ రికార్డు న్యూజిలాండ్‌ ప్లేయర్‌ సోఫీ డివైన్ పేరిట ఉండేది. డివైన్ సూపర్ స్మాష్ టీ20 లీగ్ 2021లో 36 బంతుల్లో శతక్కొట్టింది. తాజా ఇన్నింగ్స్‌లో డివైన్ ఆల్‌టైమ్ రికార్డును నవ్‌గిరే బ్రేక్ చేసింది.

శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో కిరణ్‌ మొత్తం 35 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్సర్లతో 106 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. అంతకుముందు పంజాబ్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 110 పరుగులు చేయగా… కిరణ్‌ విధ్వంసంతో మహారాష్ట్ర 8 ఓవర్లలోనే వికెట్‌ నష్టానికి 113 పరుగులు సాధించింది.

కిరణ్‌ మినహా ఇతర బ్యాటర్లు ఈశ్వరి 1, ముక్త 6 పరుగులు మాత్రమే చేశారు! మహిళల టి20ల్లో 300కు పైగా స్ట్రయిక్‌ రేట్‌తో నమోదైన సెంచరీ (302.86) ఇదొక్కటే కావడం విశేషం. 31 ఏళ్ల కిరణ్‌ నవ్‌గిరే 2022లో భారత్‌ తరఫున 6 టి20లు ఆడి 17 పరుగులు మాత్రమే చేయడంతో జట్టులో స్థానం కోల్పోయింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.