దీపావళి పండగ సందట్లో నగర వ్యాప్తంగా అక్కడక్కడ అడపాదడపా ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. దీంతో హైదరాబాద్ సరోజినీ ఆస్పత్రికి బాణసంచా బాధితులు క్యూ కడుతున్నారు.
దీపావళి పండగ నేపథ్యంలో క్రాకర్స్ కాలుస్తూ ఏకంగా 70 మంది గాయపడ్డారు. గాయపడినవారిలో 20 మంది చిన్నారులు ఉన్నారు. 12 మంది తీవ్రంగా గాయపడగా.. వారందరికీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. దీపావళి పండగ నేపథ్యంలో బాణసంచా బాధితులతో సరోజినీదేవి కంటి ఆస్పత్రి బాధితులతో నిండిపోయింది.
కాగా ప్రతి ఏడాది దీపావళి సమయంలో అధికారులు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా.. నగర వ్యాప్తంగా టపాసులు కాలుస్తూ గాయపడేవారి సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంటుంది. దీంతో యేటా దీపావళి ముగిసిన తెల్లారే హైదరాబాద్ సరోజినీ ఆసుపత్రికి బాధితులు వరుస కడుతుంటారు. రాత్రి నుండి ఇప్పటి వరకు 47 మందికి చికిత్స అందించారు. వీరిలో 18 మంది చిన్నారులు ఉన్నారు. ఇందులో ఇద్దరు యువకులు, ఇద్దరు పిల్లల పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇప్పటి వరకు 43 మందికి ప్రథమ చికిత్స అందించి ఇంటికి పంపించినట్లు ఆసుపత్రి సిబ్బంది తెలిపింది. కాగా గత సంవత్సరం 48 టపాసుల బాధితులకు సరోజినీ కంటి ఆస్పత్రిలో చికిత్స అందించారు.
































