రాత్రిపూట పక్షులు చెట్లపైన నిద్రిస్తున్నప్పుడు కింద ఎందుకు పడిపోవు.. అసలు కారణం ఇదే

ఒక్కసారి గాఢమైన నిద్రలోకి జారుకుంటే చాలు బయటి ప్రపంచంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. కదిపి లేపినా త్వరగా మేల్కోవడం కష్టం. కొందరైతే నిద్రలో పలువరించడం, బెడ్ మీద పడుకున్నప్పుడు ఉలిక్కి పడటం, కింద జారిపడటం వంటి అనుభవాలను కూడా ఎదుర్కొంటుంటారు.


అంటే నిద్రాణ స్థితిలో సరైన స్పృహ లేకపోవడమే ఇందుకు కారణం. మనుషులందరిలోనూ ఉండే సహజమైన ప్రక్రియ ఇది. కానీ పక్షుల్లో మాత్రం అలా ఉండదంటున్నారు నిపుణులు. అవి రాత్రి మొత్తం చెట్ల కొమ్మలపైనే తమ రెండుకాళ్లతో పట్టుకొని కూర్చుంటాయి. అలాగే నిద్రపోతాయి. కానీ కింద మాత్రం జారిపడవు. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ.. కారణమేంటో తెలుసా ?

చీకటి పడగానే అన్ని పక్షులు తమతమ చెట్లపైకి చేరుకుంటాయి. అన్ని ప్రాణుల్లాగే పక్షులకు నిద్ర అవసరమే. ఆహారం తీసుకున్న తర్వాత, రాత్రిపూట తమ స్థావరాల్లో పక్షులు నిద్రపోతాయి.

గూళ్లు కట్టుకుని కొన్ని పక్షులు అందులో నిద్రపోతే, మరికొన్ని చెట్ల కొమ్మలమీదే నిలబడి నిద్రిస్తాయి. ఒక్కోసారి ఒంటికాలిమీద నిలబడి కూడా నిద్రస్తాయి. అయినా ఏ మాత్రం కిందపడకుండా ఉంటాయి. నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. పక్షుల కాళ్లలో ఒక ప్రత్యేకమైన నరాల నిర్మాణం ఉంటుంది. అదే వాటిని కొమ్మల మీద నిద్రపోయినా కిందపడకుండా కాపాడుతుంది. పక్షుల కాళ్లలో సులభంగా వంగే బలమైన మెత్తని నరాలుంటాయి. ఇవి పక్షుల కాళ్లలో తొడభాగంలోని కండరాలనుంచి మోకాళ్లద్వారా కాలి చివరి వరకు అక్కడి నుంచి మడమచుట్టూ వ్యాపించి కాలివేళ్ల కింద దాకా ఉంటాయి.

కొమ్మలపై వాలగానే పక్షుల శరీరపు బరువు వాటిని మోకాళ్లపై వంగేట్టు చేస్తుంది. అప్పుడు కాళ్లలోని నరాలు వాటంతటవే బిగుసుకుపోతాయి. దాంతో కాలిగోళ్లు ముడుచుకొని చెట్టు కొమ్మలను గట్టిగా పట్టేసుకుంటాయి. కాళ్లని నేరుగా సాచేదాకా ఆ పట్టు జారదు. అందువల్లే పక్షులు కిందపడిపోకుండా కొమ్మలపై నిద్రపోతాయి. పక్షుల కాలిగోళ్లు కొమ్మలను ఎంత బిగువగా పట్టుకుంటాయంటే ఒకవేళ అవి అక్కడ చనిపోయినా కిందకు వేలాడుతూనే ఉంటాయి గానీ కిందపడిపోవు.

పక్షులు ఉష్ణ రక్త జీవులు. ఎగరడానికి అనుకూలంగా ఉండడానికి దేహం సాధారణంగా కదురు ఆకారంలో ఉండి కుదించినట్లు అమరి ఉంటుంది. వాయుగోణులు ఉండటం వల్ల తేలికగా ఉంటుంది. పూర్వాంగాలు రెక్కలుగా మార్పుచెంది ఉంటాయి. చరమాంగాలు పెద్దవిగా ఉండి జీవి దేహం బరువును మోయడానికి తోడ్పడతాయి. ఆహార సంగ్రహణ, ఈదడం, చెట్టు కొమ్మలను పట్టుకోవడం మొదలయిన వాటికి చరమాంగాలు ఉపయోగపడతాయి. శరీరం ఈకలతో కప్పబడి ఉంటుంది.

ఇవి బాహ్య అస్థిపంజరంలో భాగంగా ఉంటాయి. ఇవి నాలుగు రకాలు. అవి: 1) కాటోర్ ఈకలు, 2)పైలోప్లూమ్‌లు, 3) క్విల్ ఈకలు, 4) డేన్ ఈకలు. వీటిలో ఒకే ఒక తైల గ్రంథి లేదా ప్రీన్ గ్రంథి తోకపై ఉంటుంది. ఇది క్విల్ ఈకలపై మైనపు పూతను ఏర్పరుస్తాయి. పక్షుల అస్థిపంజరంలోని ఎముకలు వాతలాస్థులు. అస్థి మజ్జ ఉండదు. మోనో కాండైలిక్ కపాలం ఉంటుంది. విషమ గర్తి కశేరుకాలు ఉంటాయి. పర్శుకలు ద్విశిరోభాగంతో ఉంటాయి. కొన్ని కశేరుకాలు కలియడం వల్ల సంయుక్త త్రికం ఏర్పడుతుంది.

ఉరోస్థి ఉదర మధ్య భాగంలో కెరైనా ఉండి ఉడ్డయక కండరాలు అతుక్కోవడానికి తోడ్పడుతుంది. జత్రుకలు రెండూ కలిసి ఫర్కులా లేదా విష్ బోన్ ఏర్పడుతుంది. కండర వ్యవస్థ వైహాయన జీవనానికి అనుకూలంగా రూపాంతరం చెందింది. రెక్కల విధినిర్వహణలో తోడ్పడే కండరాలను ఉడ్డయక కండరాలు అంటారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.