మనం బజార్లో యాపిల్స్, నారింజ, కివీ లాంటి పండ్లు కొనేటప్పుడు వాటిమీద చిన్న చిన్న స్టిక్కర్లు అంటించి ఉండడం చూస్తుంటాం. వీటిని పండ్ల మీద ఎందుకు అంటిస్తారో తెలుసుకుందాం..
ఈ స్టిక్కర్ల మీద పీఎల్యూ కోడ్ రాసి ఉంటుంది. దీని ద్వారా పండ్లను సాగు చేసిన విధానం అంటే వాటిని సేంద్రీయ పద్ధతుల ద్వారా పండించారా, రసాయనాలు ఉపయోగించారా, జన్యుపరంగా మార్పులు చేసి ఉత్పత్తి చేశారా అనే సమాచారం తెలుసుకోవచ్చు. పండ్ల నాణ్యతను అంచనా వేయవచ్చు. పీఎల్యూ కోడ్లో నాలుగు లేదా అయిదు అంకెలు ఉంటాయి.
- స్టిక్కర్ మీద తొమ్మిదితో మొదలై అయిదు అంకెలు ఉంటే ఆ పండ్లను పూర్తిగా సేంద్రీయ విధానంలో పండించారని అర్థం. పంటలో ఎటువంటి పురుగు మందులు, రసాయనాలు ఉపయోగించలేదని గుర్తించాలి. ఈ పండ్లను ఒకసారి మంచినీళ్లతో కడిగి తినవచ్చు. ఆరోగ్యానికి మంచివి.
- స్టిక్కర్ మీద నాలుగు అంకెలు మాత్రమే ఉంటే ఆ పండ్లను పండించేటప్పుడు రసాయనాలు, ఇతర పురుగుమందులు ఉపయోగించారని అర్థం. వీటి ధర కూడా తక్కువగా ఉంటుంది. వీటిని తినేముందు ఉప్పు నీళ్లలో కొద్దిసేపు నానబెట్టి రెండు లేదా మూడుసార్లు శుభ్రంగా కడగాలి.
- స్టిక్కర్ మీద ఎనిమిదితో ప్రారంభమై అయిదు అంకెలు ఉంటే ఆ పండ్లను జన్యుపరంగా మార్పు చేశారని అర్థం.
































