నవంబర్ 1 నుంచి ఆధార్‌లో కీలక మార్పులు.. అవేంటంటే..?

భారతదేశ పౌరులకు అలెర్ట్.. నవంబర్ 1, 2025 నుండి ఆధార్ కార్డుకు సంబంధించిన మూడు ముఖ్యమైన మార్పులు దేశవ్యాప్తంగా అమలులోకి రానున్నాయి.


ఈ మార్పులు ప్రధానంగా ఆధార్ అప్‌డేట్, PAN అనుసంధానం (లింకింగ్), KYC ప్రక్రియలను ప్రభావితం చేయనున్నాయి. ఈ కొత్త నిబంధనల వల్ల పౌరులకు సౌలభ్యం పెరిగినా, కొన్ని గడువు తేదీల విషయంలో మాత్రం జాగ్రత్త వహించాలి.

ఆధార్ అప్‌డేట్:
ఆధార్‌లో వివరాలను మార్చుకోవడానికి గతంలో ఆధార్ సేవా కేంద్రాలకు వెళ్లడం తప్పనిసరిగా ఉండేది. కానీ, ఇప్పుడు రాబోయే ముఖ్యమైన మార్పు ప్రకారం మొత్తం ప్రక్రియను ఆన్‌లైన్‌లోనే పూర్తి చేయవచ్చు. ఆన్ లైన్ లో మీరు సమర్పించే పేరు లేదా చిరునామా వంటి వివరాలు.. మీ PAN కార్డు, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ లేదా రేషన్ కార్డు వంటి అధికారిక ప్రభుత్వ డాక్యుమెంట్లతో ఆటోమేటిక్‌గా ధృవీకరించబడతాయి. ఇది వేగవంతమైన, సురక్షితమైన అప్‌డేట్‌ను నిర్ధారిస్తుంది. ఇక 5 నుంచి 7 ఏళ్ల మరియు 15 నుంచి 17 ఏళ్ల పిల్లలకు ఉచిత బయోమెట్రిక్ అప్‌డేట్లు చేసుకోవచ్చు. అయితే వ్యక్తిగత వివరాల అప్‌డేట్ అంటే.. పేరు, చిరునామా లేదా మొబైల్ నంబర్ మార్పుకు రూ.75 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే బయోమెట్రిక్ అప్‌డేట్స్ వేలిముద్రలు, కనుపాప (ఐరిస్) స్కాన్ లేదా ఫోటో అప్‌డేట్‌కు రూ.125 చెల్లించాలి. ఇందులో భాగంగా జూన్ 14, 2026 వరకు ఆన్‌లైన్‌లో ఉచితంగా డాక్యుమెంట్ అప్‌డేట్లు చేసుకోవచ్చు. ఆ తర్వాత ప్రతి అప్‌డేట్‌కు రిజిస్ట్రేషన్ కేంద్రంలో రూ.75 చెల్లించాలి. అలాగే ఆధార్ కార్డును రీప్రింట్ చేసుకోవడానికి రూ.40 చెల్లించాల్సి ఉంటుంది. ఇక ముక్యముగా చెప్పుకోవాలిసింది డోర్-స్టెప్ ఎన్‌రోల్‌మెంట్ సేవలో మొదటి వ్యక్తికి రూ.700, అదే చిరునామాలో అదనపు వ్యక్తికి రూ.350 వాసులు చేయనున్నారు.

ఆధార్-పాన్ అనుసంధానం:
ఇక రెండవ అతి ముఖ్యమైన మార్పు PAN కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తుంది. PAN కార్డుదారులు తప్పనిసరిగా తమ ఆధార్‌ను డిసెంబర్ 31, 2025 లోపు లింక్ చేయాలి. ఈ గడువును పాటించడంలో విఫలమైతే జనవరి 1, 2026 నుండి మీ PAN కార్డు నిరుపయోగంగా మారుతుంది. దీని తర్వాత ఆర్థిక లేదా పన్ను సంబంధిత లావాదేవీలకు PANను ఉపయోగించడం సాధ్యం కాదు. ఇక కొత్త PAN కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వారికి, దరఖాస్తు ప్రక్రియలో భాగంగా ఆధార్ ధృవీకరణ తప్పనిసరి అవుతుంది.

బ్యాంక్ KYC ప్రక్రియలో విప్లవాత్మక మార్పులు:
బ్యాంకులు, ఆర్థిక సంస్థలలోని KYC ప్రక్రియను సులభతరం చేస్తూ మూడవ మార్పు వచ్చింది. ఇకపై KYCను కేవలం మూడు పద్ధతుల్లో సులభంగా పూర్తి చేయవచ్చు. అది ఎలా అంటే.. మొదట ఆధార్ OTP ధృవీకరణ (Aadhaar OTP verification), ఆపై వీడియో KYC (Video KYC) చివరగా ముఖాముఖి ధృవీకరణ (Face-to-face verification)గా చేసుకోవాలి. ఈ ప్రక్రియలన్నీ పూర్తిగా కాగిత రహితంగా (Paperless), సమయాన్ని ఆదా చేసే విధంగా రూపొందించబడ్డాయి.

ఈ నూతన మార్పులు ఆధార్ నిర్వహణను సులభతరం చేయడంతో పాటు, పౌరులకు విలువైన సమయాన్ని ఆదా చేయనున్నాయి. ఇంటి నుంచే వివరాలు అప్‌డేట్ చేసుకునే సౌలభ్యం, కఠినమైన డాక్యుమెంట్ ధృవీకరణ భద్రతను పెంచుతాయి. అయితే, ఆధార్-PAN లింకింగ్ గడువు అత్యంత కీలకమైనది. ఈ గడువును నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ లావాదేవీలను కొనసాగించడానికి.. మీ ఆధార్, PAN కార్డులు వెంటనే లింక్ అయ్యాయో లేదో ధృవీకరించుకోండి. ఇంకా ఆన్‌లైన్ ధృవీకరణ కోసం మీ డాక్యుమెంట్లను సిద్ధంగా ఉంచుకోండి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.