తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి శాఖకు అక్టోబర్ నెలకు సంబంధించిన పెండింగ్ బిల్లులు విడుదలకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశాలు చేశారు.
రూ. 1,032 కోట్లు ఒకేసారి విడుదల చేయాలని చెప్పారు. ఇందులో ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు రూ.712 కోట్లు కాగా.. పంచాయతీ రాజ్, ఆర్ అండ్బీ శాఖలో బిల్లుల చెల్లింపు రూ. 320 కోట్లు విడుదల చేయనున్నారు. ఆర్థిక శాఖ అధికారులతో సమీక్షించిన అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు. ఈ సమీక్షలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు.
గత ప్రభుత్వ కాలం నుంచి పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల బకాయిలను కాంగ్రెస్ సర్కార్ దశలవారీగా క్లియర్ చేస్తూ వస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు రూ.712 కోట్లను రిలీజ్ చేస్తున్నట్టుగా చెప్పారు. పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బీ విభాగాల కింద రూ. 10 లక్షల కంటే తక్కువ ఉన్న పెండింగ్ బిల్లులను కూడా పరిష్కరించడం జరిగిందని తెలిపారు.
పంచాయతీరాజ్, ఆర్అండ్బీ శాఖకు సంబంధించి 46,956 బిల్లుల తాలూకు రూ.320 కోట్లను విడుదల చేస్తున్నట్టుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. ఇందులో రోడ్లు, భవనాల శాఖకు చెందిన 3,610 బిల్లుల మొత్తం సుమారు రూ. 95 కోట్లు, పంచాయతీరాజ్, గ్రామీణ స్థానిక సంస్థలకు సంబంధించిన 43,364 బిల్లుల మొత్తం రూ.225 కోట్లను విడుదల చేశారు.
































