ఒక వ్యక్తి స్కూటీ నడిపాడు. ట్రాఫిక్ పోలీసులు అతడ్ని ఆపారు. హెల్మెట్ ధరించనందుకు ఏకంగా రూ.21 లక్షల జరిమానా విధించారు. (Scooter Fined ‘Rs 21 Lakh) ఈ చలానా చూసి ఆ వ్యక్తి షాక్ అయ్యాడు.
ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. నవంబర్ 4న అన్మోల్ సింఘాల్ తన స్కూటీపై బయటకు వెళ్లాడు. న్యూ మండి ప్రాంతంలో ట్రాఫిక్ పోలీసులు అతడ్ని తనిఖీ చేశారు. హెల్మెట్ ధరించనందుకు జరిమానా విధించారు.
కాగా, లక్ష ఖరీదైన స్కూటీకి రూ.20,74,000 జరిమానా విధించిన చలానా చూసి అన్మోల్ సింఘాల్ షాక్ అయ్యాడు. దీనిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఇది వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు స్పందించారు. జరిమానాను రూ.4,000గా సవరించారు.
మరోవైపు ముజఫర్ నగర్ ట్రాఫిక్ ఎస్పీ అతుల్ చౌబే ఈ సంఘటనపై స్పందించారు. చలానా జారీ చేసిన ఎస్ఐ పొరపాటు వల్ల ఇలా జరిగినట్లు తెలిపారు. ఈ కేసులో మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 207 కింద ఫైన్ విధించినట్లు చెప్పారు. ‘సెక్షన్ 207 తర్వాత ‘ఎంవీ యాక్ట్’ అని పేర్కొనడాన్ని ఆ ఎస్ఐ మర్చిపోయారు. దీని కారణంగా, ఈ సెక్షన్ కింద కనీస జరిమానా మొత్తం రూ. 4,000 కలిపి 20,74,000ను ఒకే సంఖ్యగా పేర్కొన్నారు’ అని అన్నారు. అయితే ఆ వ్యక్తి రూ.4,000 జరిమానా మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని ఆయన వెల్లడించారు.
































