సాగు భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ల ప్రక్రియలో అక్రమాలకు శాశ్వత అడ్డుకట్ట వేసేందుకు రెవెన్యూ శాఖ కీలకమైన సంస్కరణకు సిద్ధమవుతోంది. ఇకపై ప్రతి రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ దరఖాస్తుకు భూమి సబ్ డివిజన్ సర్వే పటం (Sub-Division Map) తప్పనిసరిగా జోడించే విధానాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
డబుల్ రిజిస్ట్రేషన్లు, ప్రభుత్వ భూముల రిజిస్ట్రేషన్లు వంటి అక్రమాలను నిరోధించడమే ఈ సంస్కరణ ముఖ్య ఉద్దేశం. అయితే ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త విధానం విజయవంతం కావడానికి.. నెలకు 40 వేలకు పైగా జరుగుతున్న భారీ సంఖ్యలో ఉన్న లావాదేవీలకు సకాలంలో సబ్ డివిజన్ పటాలను అందించడం సవాలుగా మారింది. ఈ సవాలును అధిగమించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 3,456 మంది లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించింది. గత నెల 19న ముఖ్యమంత్రి చేతుల మీదుగా వీరికి లైసెన్సులు అందజేయగా.. ప్రస్తుతం వీరిని మండల స్థాయిలో సర్దుబాటు చేస్తున్నారు.
రిజిస్ట్రేషన్ల సమయంలో సబ్ డివిజన్ సర్వే పటాన్ని జతచేసే విధానాన్ని అమలు చేయడానికి వీలుగా ప్రభుత్వం ఇప్పటికే భూ భారతి చట్టంలో ప్రత్యేక సెక్షన్ను ఏర్పాటు చేసింది. దీని ద్వారా భూమి హద్దులు, విస్తీర్ణంపై ఖచ్చితమైన వివరాలు రిజిస్ట్రేషన్ దస్తావేజులో చేరతాయి. భూమి లేకున్నా పాత దస్తావేజులు చూపించి రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం, ప్రభుత్వ లేదా వివాదాస్పద భూములను రిజిస్టర్ చేయడం వంటి అక్రమాలకు ఈ విధానం తావు ఇవ్వదని రెవెన్యూ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మొదటి విడతలో శిక్షణ పూర్తి చేసుకుని మండలాల్లో అందుబాటులోకి వచ్చిన లైసెన్స్డ్ సర్వేయర్లతో సబ్ డివిజన్ సర్వే పటాల రూపకల్పనను వెంటనే ప్రారంభించాలని రెవెన్యూ శాఖ భావిస్తోంది. కొద్దిరోజుల్లోనే ఈ ప్రక్రియను ప్రారంభించేందుకు సంబంధించిన జీవో జారీ అయ్యే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.
దీనికి అదనంగా, భూమి హక్కుల వివరాల ఖచ్చితత్వాన్ని నిర్ధారించేందుకు, జిల్లాల్లోని కొన్ని గ్రామాలను ఎంపిక చేసి ఎంజాయ్మెంట్ సర్వేను కూడా నిర్వహించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ సర్వే ద్వారా భూమిని ప్రస్తుతం ఎవరు అనుభవిస్తున్నారనే వివరాలు సేకరించి రికార్డుల్లో నమోదు చేస్తారు. ఈ కొత్త విధానం అమలులోకి వస్తే భూ యజమానులకు వారి ఆస్తిపై మరింత చట్టపరమైన భద్రత లభించడంతో పాటు, భవిష్యత్తులో భూ వివాదాలు గణనీయంగా తగ్గుతాయని రెవెన్యూ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
































