శ్రీసత్య సాయి బాబా జయంతి ఉత్సవాలు పుట్టపర్తిలో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల్లో ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా హాజరై పాల్గొన్నారు.ప్రధాని నరేంద్రమోడీతోపాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు,డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు, కిషన్ రెడ్డి, శ్రీనివాసవర్మ ఇతర రాష్ట్రమంత్రులు పాల్గొన్నారు.
బాబా మహాసమాధిని సందర్శించి నివాళులు అర్పించిన ప్రధాని నరేంద్రమోడీ అనంతరం హిల్ వ్యూ స్టేడియంలో జరుగుతున్న సత్యసాయి జయంతి వేడుకలలో పాల్గొన్నారు.ఈ వేడుకలలో క్రికెట్ మాజీ దిగ్గజం సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ నటి ఐశ్వర్య బచ్చన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భగా ప్రధాని నరేంద్రమోడీని సీఎం చంద్రబాబు నాయుడు ఘనంగా సత్కరించారు. అనంతరం శ్రీ సత్యసాయి రూ.100 నాణెంతోపాటు పోస్టల్ స్టాంపులను సైతం ప్రధాని నరేంద్రమోడీ ఆవిష్కరించారు. ఇకపోతే రూ.100 నాణెం ఒకవైపు సత్యసాయిబాబా చిత్రం మరోవైపు అశోక్ స్తంభంతో ఉంది. త్వరలో ఆన్ లైన్ బుకింగ్ ద్వారా నాణెం క్రయ, విక్రయాలు జరగనున్నాయి.
శ్రీ సత్యసాయిబాబా సమాధిని దర్శించుకున్న ప్రధాని మోడీ
శ్రీసత్య సాయి బాబా జయంతి ఉత్సవాలలో భాగంగా బాబా మహా సమాధి దర్శనార్థం భారత ప్రధాని నరేంద్రమోడీ పుట్టపర్తికి విచ్చేశారు. ప్రత్యేక విమానంలో శ్రీ సత్య సాయి పుట్టపర్తి విమానాశ్రయానికి విచ్చేసిన ప్రధాని నరేంద్రమోడీకి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, మంత్రి నారా లోకేశ్తోపాటు ఇతర మంత్రులు,ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు ఘన స్వాగత పలికారు.అనంతరం శ్రీ సత్య సాయి విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన ప్రశాంతి మందిరానికి ప్రధాని నరేంద్రమోడీ చేరుకున్నారు.అక్కడ ప్రధా నరేంద్రమోడీకి సత్య సాయి ట్రస్ట్ సభ్యులు సాగర స్వాగతం పలికి ఆహ్వానించారు. అనంతరం సాయి కుల్వంత్ మందిరంలో బాబా మహా సమాధిని దర్శించుకున్న వారు ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోయారు. అనంతరం సాయి భక్తి గానామృతం సంగీత కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోడీ పాల్గొన్నారు.
శ్రీసత్యసాయికి నివాళులర్పించిన సచిన్ , ఐశ్వర్యరాయ్
శ్రీసత్య సాయి బాబా జయంతి ఉత్సవాలలో భాగంగా బాబా మహా సమాధి దర్శనార్థం క్రికెట్ మాజీ దిగ్గజం సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ మాజీ హీరోయిన్ ఐశ్వర్య బచ్చన్ పుట్టపర్తికి విచ్చేశారు. ప్రత్యేక విమానంలో శ్రీ సత్య సాయి పుట్టపర్తి విమానాశ్రయానికి విచ్చేసిన సచిన్ టెండూల్కర్, ఐశ్వర్య బచ్చన్ కు బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సభ్యులు చాముండేశ్వరి నాథ్ ,జిల్లా అధికారులు ఘన స్వాగతం పలికారు. శ్రీ సత్య సాయి విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన ప్రశాంతి మందిరానికి చేరుకున్న సచిన్ టెండుల్కర్ ఐశ్వర్య బచ్చన్ కు సత్య సాయి ట్రస్ట్ సభ్యులు సాగర స్వాగతం పలికి ఆహ్వానించారు. అనంతరం సాయి కుల్వంత్ మందిరంలో బాబా మహా సమాధిని దర్శించుకున్న వారు ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోయారు. అనంతరం సాయి భక్తి గానామృతం సంగీత కార్యక్రమంలో పాల్గొన్నారు.
శతజయంతి వేడుకలను ప్రాంభించిన మంత్రి సవిత
ఇకపోతే నవంబర్ 18న శ్రీ సత్యసాయి శతజయంతి వేడుకలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. రథాన్ని లాగి సత్యసాయి శత జయంతి వేడుకలను మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్, మంత్రి సవిత , కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎమ్మెల్యే సింధూర, ఎమ్మెల్యే పరిటాల సునీతలు ప్రారంభించారు. రథానికి ముందు భాగాన సత్యసాయి విద్యార్థులు సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా చిన్నికృష్ణులు గోపికమ్మల వేషధారణతో సందడి చేశారు. కోలాటం, చెక్కభజనలు, కీలుగుర్రాలు, గొరవయ్యల నృత్యంతో రథోత్సవం ఆసాంతం చూపరులను మంత్రముగ్ధులను చేసింది. ఈ వేడుకలను తిలకించడానికి దేశ విదేశీ నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో పుట్టపర్తి పురవీధులు కిక్కిరిసిపోయాయి. మరోవైపు భక్తులకు దాతలు ఆహార పొట్లాలు, మంచినీరు అందించి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు.
































