తెలుగు రాష్ట్రాల్లో కొండెక్కిన కోడిగుడ్డు.. రికార్డు స్థాయికి ధరలు

రెండు తెలుగు రాష్ట్రాల్లో కోడిగుడ్ల ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఉత్పత్తి తగ్గడం, డిమాండ్ పెరగడంతో ధరలు రికార్డు స్థాయికి చేరాయి. రిటైల్ మార్కెట్లో ఒక్కో గుడ్డు ధర ఏకంగా ఏడు రూపాయలు దాటిపోగా, హోల్‌సేల్ మార్కెట్లలోనూ ధరలు ఆల్ టైమ్ గరిష్ఠానికి చేరుకున్నాయి.


చిత్తూరు జిల్లా హోల్‌సేల్ మార్కెట్లో శుక్రవారం నాటికి 100 గుడ్ల ధర రికార్డు స్థాయిలో రూ. 673కు చేరింది. విశాఖపట్నం, హైదరాబాద్ మార్కెట్లలో రూ. 635గా నమోదైంది. విజయవాడలో రూ.660, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో రూ. 639గా పలుకుతోంది. ఈ ధరలు రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.

ఈ ధరల పెరుగుదలకు ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయని పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఉత్తర భారతంలో చలి తీవ్రత పెరగడంతో అక్కడికి తెలుగు రాష్ట్రాల నుంచి గుడ్ల ఎగుమతులు భారీగా పెరిగాయి. దీనికి తోడు, ఇటీవల ఏపీ, తెలంగాణలో వ్యాధుల కారణంగా పెద్ద సంఖ్యలో కోళ్లు మరణించడంతో గుడ్ల ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది.

కోడిగుడ్ల ధరలు ఇలా ఆకాశాన్నంటుతుంటే, మరోవైపు చికెన్ ధర తగ్గడం గమనార్హం. ప్రస్తుతం మార్కెట్లో కిలో స్కిన్‌లెస్ చికెన్ ధర రూ.226 వద్ద అమ్ముడవుతోంది. సరఫరా, డిమాండ్ మధ్య ఉన్న ఈ వ్యత్యాసం వినియోగదారులపై మిశ్రమ ప్రభావం చూపుతోంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.