- మంచి జీతం కూడా ఇస్తాం.. ‘ఐ బొమ్మ’ రవికి పోలీసుల ఆఫర్!
- తిరస్కరించిన రవి.. కరీబియన్ దీవుల్లో ‘ఐ బొమ్మ’ రెస్టారెంట్ పెడతా
- ఆంధ్ర, తెలంగాణ వంటలను రుచి చూపిస్తా..
- వచ్చే డబ్బుతో జీవితాన్ని ఆస్వాదిస్తా
- పోలీసుల విచారణలో వెల్లడించిన రవి
- సాంకేతికతపై ఉన్న పట్టుతో కొత్త సినిమాలను పైరసీ చేసి, సినీ పరిశ్రమకు చుక్కలు చూపించిన ఐ బొమ్మ రవికి పోలీసులు ఓ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. అతని తెలివితేటలను గుర్తించిన పోలీసు ఉన్నతాధికారులు విచారణలో భాగంగా.. ‘పోలీసు శాఖలోకి వచ్చి, సైబర్ క్రైమ్ విభాగంలో పనిచేస్తావా? మంచి జీతం కూడా ఇస్తాం’ అని అడిగినట్లు తెలిసింది. రవి మాత్రం వారి ఆఫర్ను తిరస్కరించినట్లు సమాచారం. ఇమ్మడి రవిని కస్టడీలోకి తీసుకొని విచారించిన పోలీసులు అనేక కొత్త విషయాలు రాబట్టినట్లు తెలిసింది. విచారణలో భాగంగా ‘నీ బొమ్మ క్లోజ్ అయింది. తర్వాత ఏంటి?’ అని పోలీసులు ప్రశ్నించగా.. కరేబియన్ దీవుల్లో ఒక రెస్టారెంట్ పెట్టి తెలంగాణ, ఆంధ్రాతో పాటు దేశంలోని ప్రముఖ వంటకాలను అక్కడి ప్రజలకు రుచి చూపించి డబ్బు సంపాదిస్తానని రవి చెప్పినట్లు తెలిసింది. రెస్టారెంట్కు ఏం పేరు పెడతావని పోలీసులు ప్రశ్నించారు. ‘ఐ బొమ్మ’ పేరే పెడతానని రవి బదులివ్వడం విశేషం. కొద్ది రోజుల్లోనే కరేబియన్ దీవుల్లోని అన్ని దేశాల్లో ఐ బొమ్మ రెస్టారెంట్ శాఖలను ఏర్పాటు చేస్తానని, భారత వంటకాలకు అక్కడి ప్రజలు అలవాటు పడేలా చేస్తానని రవి చెప్పినట్లు తెలిసింది.
అనుభవించు రాజా.. అదే లక్ష్యం..
ఐ బొమ్మ రెస్టారెంట్తో వచ్చే డబ్బుతో జీవితాన్ని ఉల్లాసంగా గడపడమే తన లక్ష్యమని రవి పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. అతను లక్ష డాలర్లు (రూ.80 లక్షలు) వెచ్చించి, కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ దేశ పౌరసత్వాన్ని తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు సంపాదించిన రూ.20 కోట్లలో ఎంజాయ్ చేయడానికే రూ.17 కోట్లు ఖర్చు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇకపై కూడా తాను అనుకున్నట్లుగానే వారానికో దేశం తిరుగుతూ తనకు నచ్చినట్లు, హాయిగా గడుపుతానని వెల్లడించినట్లు తెలిసింది. కాగా, రవి ఖాతాల్లో దొరికిన రూ.3 కోట్ల డబ్బుతో పాటు హైదరాబాద్లోని ఫ్లాటు, విశాఖపట్నంలో ఉన్న ఆస్తులను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. త్వరలోనే అతనికి బెయిల్ వచ్చే అవకాశం ఉన్నట్లు పోలీసు వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.

































