రాష్ట్రంలో 1000 విజయ డెయిరీ పార్లర్లు.. వారికి గొప్ప అవకాశం, నెలకు రూ. లక్ష వరకు ఆదాయం

విజయ డెయిరీ ఉత్పత్తులను ప్రజలకు మరింత చేరువ చేస్తూనే.. మహిళా సంఘాలకు ఆర్థిక స్వావలంబన కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం ఒక బృహత్తర ప్రణాళికను సిద్ధం చేసింది.


రాష్ట్రవ్యాప్తంగా 1,000 విజయ డెయిరీ పార్లర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య మరియు సెర్ప్‌ (SERP) సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. మండలానికి ఒకటి, ప్రతి పురపాలికకు రెండు చొప్పున ఈ పార్లర్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. ముఖ్యంగా ‘ఇందిరా మహిళా శక్తి’ పథకం కింద మహిళా సంఘాలకు ప్రాధాన్యత ఇస్తూ.. వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశ్యం.

ఈ పార్లర్ల ఏర్పాటుకు అవసరమైన ఆర్థిక వనరులను ప్రభుత్వం వివిధ రూపాల్లో సమకూరుస్తోంది. ఒక్కో పార్లర్ ఏర్పాటుకు సుమారు 5 లక్షల రూపాయల వ్యయం అవుతుందని అంచనా. ఇందులో 3 లక్షల రూపాయలు డిపాజిట్ కోసం, మరో 2 లక్షల రూపాయలు మౌలిక సదుపాయాల కోసం కేటాయిస్తారు. జాతీయ గ్రామీణ జీవనోపాధి పథకం (NRLM) లేదా మెప్మా ద్వారా 2 లక్షల రూపాయల సాయం అందుతుంది. మహిళా సమాఖ్యలు తమ వాటాగా ఒక లక్ష రూపాయలు సమకూర్చుకుంటే, మిగిలిన 2 లక్షల రూపాయలను సెర్ప్ ద్వారా రుణంగా అందిస్తారు. తద్వారా సామాన్య మహిళలు కూడా సులభంగా ఈ వ్యాపారంలో అడుగుపెట్టే అవకాశం కలిగింది.

విజయ డెయిరీ విక్రయాలను రెట్టింపు చేయడమే లక్ష్యంగా రద్దీగా ఉండే ప్రదేశాలు, ప్రభుత్వ కార్యాలయాల ఆవరణల్లో ఈ పార్లర్లను నెలకొల్పనున్నారు. హైదరాబాద్‌లో నిరుద్యోగుల కోసం ప్రత్యేకంగా మరో వంద పార్లర్లను ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు. ఈ పార్లర్ల ద్వారా పాలు, పెరుగుతో పాటు విజయ డెయిరీ తయారు చేసే పలు రకాల ఉత్పత్తులను విక్రయించవచ్చు. వ్యాపారం సమర్థవంతంగా సాగితే.. నిర్వహణ ఖర్చులు పోను నెలకు సుమారు లక్ష రూపాయల వరకు ఆదాయం పొందే అవకాశం ఉండటం మహిళా సంఘాలకు పెద్ద ఊరటనిచ్చే అంశం. ప్రభుత్వమే స్థల ఎంపిక, రుణ సదుపాయం కల్పిస్తుండటంతో ఈ పథకం మహిళా సాధికారతకు కొత్త బాటలు వేయనుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.