11 నిమిషాలు చనిపోయి, బతికింది.. ఆమె చెప్పింది విని డాక్టర్లు షాక్

మెరికాకు చెందిన 68 ఏళ్ల షార్లెట్ హోమ్స్ అనే మహిళ 2019లో ఒక రొటీన్ హార్ట్ చెకప్ చేయించుకున్నప్పుడు ఊహించని పరిణామం ఎదురైంది. ఆమె బ్లడ్ ప్రెషర్ అకస్మాత్తుగా 234/134కి పెరిగిపోవడంతో ఆమెను అత్యవసరంగా ఆసుపత్రికి తరలించారు.
చికిత్స సమయంలో ఆమె గుండె ఆగిపోయి, 11 నిమిషాల పాటు క్లినికల్‌గా మరణించినట్లు డాక్టర్లు ప్రకటించారు. అయితే, డాక్టర్లు ఆమెను పునరుజ్జీవింపజేసిన తర్వాత, షార్లెట్ తన అనుభవాన్ని పంచుకుని ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఆ 11 నిమిషాల్లో ఆమె స్వర్గం, నరకం రెండింటినీ చూసినట్లు, మరచిపోలేని ప్రత్యేకమైన సుగంధాన్ని అనుభవించినట్లు చెప్పింది.


షార్లెట్ హోమ్స్ మాటల్లో చెప్పాలంటే.. ఆమె శరీరం నుంచి విడిపోయి.. పైనుంచి చూస్తూ ఉంది. (అంటే ఆత్మ లాగా అనుకోవచ్చు). డాక్టర్లు తనపై చేస్తున్న చికిత్సను ఆమె స్పష్టంగా గమనించిందట. అప్పుడు భర్త డానీ గది మూలన నిలబడి ఉన్నాడు. నర్సులు చుట్టూ ఉన్నారు. అకస్మాత్తుగా ఆమెకు అద్భుతమైన పూల సుగంధం వచ్చింది. జీవితంలో ఎప్పుడూ వాసన చూడని అందమైన, మరచిపోలేని సుగంధం అది. అదే సమయంలో సంగీతం వినిపించింది. కళ్లు మూసి, తెరిచినప్పుడు స్వర్గంలో ఉన్నట్లు ఆమెకు అనిపించింది. అక్కడ ఏ భయమూ లేదు, పూర్తి ఆనందం మాత్రమే. చెట్లు, గడ్డి, ప్రకృతి అంతా సంగీతంతో కలిసి దేవుని స్తుతిస్తున్నట్లు కనిపించాయట.

స్వర్గంలో ఆమె తన మరణించిన బంధువులను చూసింది. తల్లిదండ్రులు, సోదరి వంటి వారు యవ్వనంలో ఉన్నట్లు, ఆరోగ్యంగా, సంతోషంగా కనిపించారు. వారి వెనుక అత్యంత ప్రకాశవంతమైన కాంతి ఉంది. అది దేవుడు అని ఆమె అనుకుంది. అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు (5 నెలల 15 రోజులు) కోల్పోయిన తన బిడ్డను స్వర్గంలో చిన్న పిల్లవాడిగా చూసిందట. అప్పుడు తనకు దేవుడు ఒక మాట చెప్పాడని తెలిపింది. “స్వర్గంలో వారు పెరుగుతూనే ఉంటారు, కానీ అక్కడ సమయం లేదు, అది శాశ్వతత్వం” అని దేవుడు చెప్పాడట.

అయితే ఆ అనుభవం అంతా స్వర్గంతోనే ముగియలేదు. దేవుడు ఆమెను నరకం అంచుకి తీసుకెళ్లాడట. అక్కడ కంపు కొట్టే దుర్వాసన. అంటే.. కుళ్లిన మాంసం వాసన వచ్చిందట. అరుపులు, బాధలు చూసింది. స్వర్గ సౌందర్యానికి పూర్తి వ్యతిరేకంగా నరకం ఉందట. “స్వర్గ సౌందర్యం చూసిన తర్వాత నరకం చూడటం భరించలేనిది” అని ఆమె చెప్పింది. దేవుడు ఇలా చూపించడానికి కారణం ఉందని చెప్పింది. కొందరు తమ మార్గాలు మార్చుకోకపోతే అక్కడికే వెళ్తారని హెచ్చరికగా చూపించారని ఆమె అంది.

ఆ తర్వాత ఆమెకు తన తండ్రి గొంతు వినిపించింది. “నీవు తిరిగి వెళ్లి ఇవన్నీ పంచుకోవాలి” అని తండ్రి చెప్పగానే.. ఆమె ఆసుపత్రి బెడ్‌పై మేల్కొంది. భర్తతో అన్నీ చెప్పింది. ఆమె 11 నిమిషాలు చనిపోయింది అని డాక్టర్లు ధృవీకరించారు. ఎందుకంటే.. ఆ 11 నిమిషాలూ ఆమె గుండె ఆగిపోయింది.

ఈ కథ 2019 నాటిదైనప్పటికీ, 2025 చివర్లో మళ్లీ వైరల్ అవుతోంది. అనేక వార్తా సంస్థలు దీన్ని మళ్లీ గుర్తు చేస్తున్నాయి. మరణానంతర జీవితం గురించి ఆసక్తి ఉన్నవారికి ఇది ఆశను, హెచ్చరికను ఇస్తోంది. షార్లెట్ 2023లో మరణించినా, ఆమె కథ ఇప్పటికీ ప్రజలను ఆలోచింపజేస్తోంది. స్వర్గం నిజమేననీ, అక్కడ భయం లేదని ఆమె ధైర్యంగా చెప్పింది. ఈ అనుభవం మరణం గురించి కొత్త చర్చను రేకెత్తిస్తోంది. శాస్త్రీయంగా వివరించలేని ఈ నియర్ డెత్ ఎక్స్‌పీరియన్స్‌లు నిజమైనవా? లేక మెదడు హాలుసినేషన్సా? అనేది ప్రస్తుతానికి మిస్టరీయే. అయినా, షార్లెట్ కథ మిలియన్ల మందికి ఆశనూ, ఆలోచననూ ఇస్తోంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.