అన్నదాతలకు బిగ్ అలర్ట్.. జిల్లాల వారీగా యూరియా నిల్వల డేటా విడుదల

అన్నదాతలకు ఇళ్లలో నుంచే యూరియా బుకింగ్ సౌకర్యం కల్పిస్తూ రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రవేశపెట్టిన యూరియా మొబైల్ యాప్ విజయవంతమైంది.


పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టిన ఈ యాప్‌తో వేలాది మంది రైతులు సులభంగా యూరియా బస్తాలను ముందుగానే బుక్ చేసుకుంటున్నారు. అయితే, కొన్నిచోట్ల తమకు యూరియా దొరుకుతుందో లేదో అని అన్నదాతలు తర్జనభర్జన పడుతున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ క్రమంలోనే జిల్లా వారీగా యూరియా నిల్వల వివరాలను ఇవాళ వ్యవసాయ శాఖ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 47,68,029 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. ఇక అత్యధికంగా నల్గొండ జిల్లాలో 3,09,679 మెట్రిక్ టన్నులు, ఖమ్మం జిల్లాలో 3,09,681 మెట్రిక్ టన్నులు, వికారాబాద్ జిల్లాలో 2,91,808 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నట్లుగా నివేదికలో స్పష్టం చేశారు.

అదేవిధంగా సిద్దిపేట జిల్లాలో 2,44,008 మెట్రిక్ టన్నులు, మహబూబ్‌నగర్ జిల్లాలో 2,34,608 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయి. మరోవైపు, కొన్ని జిల్లాల్లో నిల్వలు తక్కువగా ఉన్నప్పటికీ మొత్తం రాష్ట్ర స్థాయిలో ఎలాంటి కొరత లేదని అధికారులు వెల్లడించారు. వనపర్తి జిల్లాలో 64,517 మెట్రిక్ టన్నులు, ములుగు జిల్లాలో 71,505 మెట్రిక్ టన్నులు, మెదక్ జిల్లాలో 1,22,402 మెట్రిక్ టన్నులు ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం ప్రభుత్వ డిలర్ల ద్వారా 31,077 మెట్రిక్ టన్నులు, సహకార సంఘాల ద్వారా 16,755 మెట్రిక్ టన్నులు, మార్క్‌ఫెడ్ ద్వారా 1,66,730 మెట్రిక్ టన్నులు, మొత్తం డిమాండ్ 2,14,561 మెట్రిక్ టన్నులకు వ్యతిరేకంగా భారీ నిల్వలు అందుబాటులో ఉన్నాయి. ఈ నిల్వలతో రాబోయే రబీ సీజన్‌లో రైతులకు ఎరువుల కొరత లేదని, ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని వ్యవసాయ శాఖ అధికారులు స్పష్టం చేశారు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.