దీంతో అప్రమత్తమైన అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా).. ముందస్తుగా నిర్ణయించిన స్పేస్వాక్ను నిరవధికంగా వాయిదా వేయడమే కాకుండా, సదరు వ్యోమగామిని సాధ్యమైనంత త్వరగా భూమికి చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
చివరి నిమిషంలో నిలిచిపోయిన స్పేస్వాక్..
షెడ్యూల్ ప్రకారం.. జనవరి 8వ తేదీన వ్యోమగాములు మైక్ ఫిన్సీ, జెనా కార్డ్మన్లు సుమారు 6.5 గంటల పాటు అంతరిక్షంలో నడవాల్సి ఉంది. ఇది ఈ ఏడాదిలో జరగాల్సిన తొలి స్పేస్వాక్. అయితే క్రూ-11 బృందంలోని ఒక సభ్యుడికి తీవ్రమైన అనారోగ్య సమస్య తలెత్తడంతో నాసా ఈ ప్రయోగాన్ని నిలిపి వేసింది. జనవరి 15వ తేదీన జరగాల్సిన రెండో స్పేస్వాక్ పైన కూడా ఇప్పుడు నీలినీడలు కమ్ముకున్నాయి.
25 ఏళ్ల చరిత్రలో మొదటిసారి..
సాధారణంగా అంతరిక్ష ప్రయోగాలు అత్యంత ఖచ్చితత్వంతో, నిర్ణీత గడువు ప్రకారం జరుగుతాయి. కానీ తాజా పరిస్థితుల దృష్ట్యా క్రూ-11 మిషన్ను షెడ్యూల్ కంటే ఒక నెల ముందుగానే ముగించాలని నాసా నిర్ణయించింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం పని ప్రారంభించిన గత 25 ఏళ్ల చరిత్రలో.. ఇలా మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా ఒక మిషన్ను నెల రోజుల ముందే అర్ధాంతరంగా నిలిపివేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
గోప్యంగా వ్యోమగామి వివరాలు..
వైద్య సంబంధిత ప్రోటోకాల్స్, గోప్యతా కారణాల దృష్ట్యా.. అనారోగ్యానికి గురైన వ్యోమగామి పేరును గానీ, ఆ సమస్య ఏంటనేది గానీ నాసా బహిర్గతం చేయలేదు. అయితే సదరు వ్యోమగామి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని, కేవలం ముందస్తు జాగ్రత్తలు, మెరుగైన చికిత్స కోసమే భూమికి రప్పిస్తున్నామని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. గతంలో కొందరు వ్యోమగాముల్లో మైక్రోగ్రావిటీ కారణంగా రక్తం గడ్డకట్టడం వంటి సమస్యలు వచ్చినట్లు కొన్ని నివేదికలు చెబుతున్నా, తాజా ఘటనపై నాసా పెదవి విప్పడం లేదు. ప్రస్తుతం ఐఎస్ఎస్ లో ఉన్న నలుగురు వ్యోమగాములను వీలైనంత త్వరగా సురక్షితంగా భూమికి చేర్చడమే తమ ప్రాధాన్యతని నాసా ప్రకటించింది.


































