సత్యసాయి జిల్లాలో నిర్మాణంలో ఉన్న బెంగళూరు-కడప-విజయవాడ ఎకనామిక్ కారిడార్ జాతీయ స్థాయిలోనే కాదు… ప్రపంచ స్థాయిలోనూ భారతదేశానికి కీర్తి తెచ్చింది
కేవలం కొన్ని రోజుల్లోనే నాలుగు గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించిన సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వర్చువల్గా హాజరై ప్రసంగించారు. జీఎస్డీపీ సమీక్షా సమావేశం నుంచే ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు హాజరుకాగా, నాగపూర్ నుంచి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వర్చువల్గా పాల్గొన్నారు. మంత్రులు, ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.
6 రోజుల్లో 156 లేన్ కిలోమీటర్లు… అరుదైన ఘట్టం
బెంగళూరు-విజయవాడ ఎకనామిక్ కారిడార్ పనుల్లో భాగంగా జాతీయ రహదారుల నిర్మాణ సంస్థ (NHAI) కేవలం 6 రోజుల్లో 156 లేన్ కిలోమీటర్ల రహదారి నిర్మాణం చేపట్టి చరిత్ర సృష్టించింది. అందులో భాగంగా జనవరి 6న 24 గంటల్లోనే 28.8 కిలోమీటర్ల రహదారి నిర్మాణం జరిగింది. జనవరి 6 నుంచి 11 వరకు నిరంతరాయంగా 52 కిలోమీటర్ల 6 లేన్ రహదారి, 84.4 కిలోమీటర్ల 4 లేన్ రహదారి నిర్మాణం జరిగింది. 10,655 మెట్రిక్ టన్నుల బిటుమిన్ కాంక్రీట్ను నిరంతరంగా సప్లై చేయడం మరో కీలక ఘట్టం. ఈ అద్భుత నిర్మాణాలను ఐఐటీ బాంబే పర్యవేక్షించగా, రాజ్ పథ్ ఇన్ఫ్రా కామ్ సంస్థ కీలక పాత్ర పోషించింది.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ… బెంగళూరు-విజయవాడ ఎకనామిక్ కారిడార్లో నాలుగు గిన్నిస్ రికార్డులు సాధించటం గర్వకారణమని అన్నారు. ఈ విజయం బృందపనితనం వల్లే సాధ్యమైందని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పనిచేసే వేగం, సామర్థ్యం దేశమంతా తెలుసన్న చంద్రబాబు… అత్యంత వేగంగా, అత్యంత పొడవైన బిటుమిన్తో కూడిన 6 లేన్ జాతీయ రహదారి నిర్మాణం ద్వారా ప్రపంచ రికార్డు సాధించామని చెప్పారు. అమరావతి నుంచి బెంగళూరు వరకు స్ట్రెయిట్ రోడ్డును నిర్మించాలన్న నిర్ణయం తీసుకున్నామని, దానికి “అమరావతి-బెంగళూరు రోడ్” అనే పేరు పెట్టాలని కేంద్రాన్ని కోరుతున్నట్లు వెల్లడించారు. ఈ ఘన విజయానికి సహకరించిన ప్రతిఒక్కరికీ అభినందనలు తెలిపారు.
సత్యసాయి ఆశీర్వాదంతోనే ఈ ప్రపంచ రికార్డులు
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తన ప్రసంగంలో… భగవాన్ సత్యసాయి ఆశీర్వాదంతోనే ఈ కారిడార్లో నాలుగు గిన్నిస్ రికార్డులు సాధించగలిగామని అన్నారు. నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా వేగంగా రహదారుల నిర్మాణమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. కొత్త ఆవిష్కరణలతో జాతీయ రహదారుల నిర్మాణం చేపడుతున్నామని, వరిగడ్డి నుంచి బిటుమిన్ తయారీ వంటి వినూత్న సాంకేతికతలో ఏపీ కూడా భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించారు. పర్యావరణ పరిరక్షణతో పాటు కాలుష్యరహిత విధానాలు అనుసరించాల్సిన అవసరం ఉందని గడ్కరీ అన్నారు.
ఏపీ ప్రభుత్వ సహకారంతోనే సాధ్యం
ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే ఈ స్థాయి వేగం సాధ్యమైందని గడ్కరీ ప్రశంసించారు. జాతీయ రహదారి ప్రాజెక్టులకు ఏపీ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని తెలిపారు. ప్రస్తుతం భారత్ అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ అని పేర్కొన్న గడ్కరీ… రవాణా వ్యయం 9 శాతం కంటే తక్కువకు తీసుకురావాల్సిన అవసరం ఉందని, లాజిస్టిక్స్ ఖర్చు తగ్గితే అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందని చెప్పారు. బెంగళూరు-విజయవాడ మార్గంలో ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుందని స్పష్టం చేశారు.
అభివృద్ధి దిశగా మరో ముందడుగు
చంద్రబాబు నాయుడు ప్రతిపాదించిన అభివృద్ధి ఆలోచనలను ఎప్పుడూ ఆమోదించేందుకు సిద్ధంగా ఉన్నామని నితిన్ గడ్కరీ వెల్లడించారు. ప్రజల శ్రేయస్సు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు తన జీవితాన్ని అంకితం చేశారని ప్రశంసించారు.

































