పెళ్లి ముహూర్తాలొచ్చేశాయ్! వధూవరుల ఇళ్లలో పెళ్లి సందడి మొదలైంది. నవంబరు నుంచి మౌఢ్యాల కారణంగా నిలిచిన శుభ ముహూర్తాలు..
3నెలల అనంతరం మోగనున్న పెళ్లి బాజాలు
- ఫిబ్రవరి 19 నుంచి వివాహ ముహూర్తాలు
- మరీ మంచిరోజు కావడంతో ఆనెల 21న ఎక్కువ పెళ్లిళ్లు
- పురోహితులు, క్యాటరర్లు, వెడ్డింగ్ ప్లానర్ల డైరీలన్నీ ఫుల్
- పెళ్లి ముహూర్తాలొచ్చేశాయ్! వధూవరుల ఇళ్లలో పెళ్లి సందడి మొదలైంది. నవంబరు నుంచి మౌఢ్యాల కారణంగా నిలిచిన శుభ ముహూర్తాలు.. శుక్ర మౌఢ్యమి ఈనెల 17న ముగియడంతో మోగించండి పెళ్లి బాజాలు అంటూ పరుగు పరుగున వచ్చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మూడు నెలల తర్వాత పెళ్లిళ్లు, రిసెప్షన్లతో కల్యాణమండపాలు మళ్లీ కళకళలాడనున్నాయి. మన పంచాగాల ప్రకారం ఫిబ్రవరి 19, 20, 21, 24, 25, 26… తేదీలు వివాహాలకు అనుకూలం. అలాగే 19,20,21 తేదీలల్లో గృహ ప్రవేశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఫిబ్రవరి 21న ఎక్కువ పెళ్లిళ్లున్నాయి. ఆ రోజు పంచమి మరీ మంచి ముహూర్తం కావడం, అలాగే వీకెండ్ కావడం కారణాలు అని చెబుతున్నారు. ఫిబ్రవరి తర్వాత మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై వరకు అన్నీ మంచిరోజులే ఉన్నాయంటున్నారు పురోహితులు! ఫలితంగా పురోహితులు, క్యాటరర్స్, వెడ్డింగ్ ప్లానర్ల డైరీలన్నీ ఫుల్ అయ్యాయి. వఽధూవరుల తల్లిదండ్రులు ఫంక్షన్ హాళ్లను వెతుక్కునే పనిలో పడ్డారు. కొన్ని ఫంక్షన్ హాళ్లు దొరికినా రేట్లు విపరీతంగా చెబుతున్నారనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పురోహితులు సంభావన, క్యాటరర్స్ రేట్లు కూడా పెరిగాయంటున్నారు. మునుపు ఓ వివాహం చేయిస్తే పురోహితులు రూ.25-60వేలు తీసుకునే వారు. ఇప్పుడు రూ.40-80 వేలు అడుగుతున్నారని ఓ తండ్రి వాపోయారు. మ్యారేజ్ ఫంక్షన్ హాల్కు గతంలో 10 లక్షలు చెల్లిస్తే ఇప్పుడు 13లక్షలకు తక్కువ రాదంటున్నారని, ఇక డెకరేషన్, క్యాటరింగ్ వంటివి కూడా అదే స్ధాయిలో వెళ్లిపోతున్నాయన్నారు. ఒక్కసారిగా అందరూ శుభ ముహూర్తమంటూ ఫిబ్రవరి 21 కోసం చూడటం వల్లనే ఇంత డిమాండ్ కావొచ్చన్నారాయన.


































