SBI Har Ghar Lakhpati Scheme Calculator: డిపాజిట్లను పెంచుకునేందుకు.. ఆర్థిక భద్రత కోరుకునే వారి కోసం ఎస్బీఐ గతేడాది రెండు కొత్త స్కీమ్స్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇవే ఎస్బీఐ ప్యాట్రన్స్, ఎస్బీఐ హర్ ఘర్ లఖ్పతీ రికరింగ్ డిపాజిట్ పథకాలు. కాలక్రమేణా వీటిల్లో వడ్డీ రేట్లను సైలెంట్గా తగ్గించింది. చిన్న మొత్తాల్లో పొదుపు చేయడం ద్వారా లక్షాధికారుల్ని చేసే లక్ష్యంగా తీసుకొచ్చిన హర్ ఘర్ లఖ్పతీ పథకం గురించి వివరాల్ని చూద్దాం.
SBI Special Scheme : భారతదేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్లకు ఎన్నో రకాల సర్వీసుల్ని అందిస్తుంది. జీరో బ్యాలెన్స్తో సేవింగ్స్ అకౌంట్ ఇవ్వడమే కాకుండా.. ఆకర్షణీయ వడ్డీ రేట్లతో ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు, పర్సనల్ లోన్, వెహికిల్ లోన్, హోం లోన్ సహా ఇతర అధిక వడ్డీ అందించే స్పెషల్ స్కీమ్స్ ఇలా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ బ్యాంకుకు ఏకంగా 50 కోట్ల మందికిపైగా కస్టమర్లు ఉన్నారు. దీంతో వీరి కోసం.. వీరిలో పొదుపు, పెట్టుబడుల్ని ప్రోత్సహించేందుకు కొత్త కొత్త పథకాల్ని లాంఛ్ చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే ఆర్థిక భద్రత పెంపొందించేందుకు.. బ్యాంక్ కూడా డిపాజిట్లను పెంచుకునే ఉద్దేశంతో గతేడాది రెండు కొత్త డిపాజిట్ స్కీమ్స్ తెచ్చిన సంగతి తెలిసిందే.
వీటిల్లో ఎస్బీఐ ప్యాట్రన్స్ ఒకటి కాగా.. మరొకటి ఎస్బీఐ హర్ ఘర్ లఖ్పతీ ఆర్డీ స్కీమ్. ఇక్కడ హర్ ఘర్ స్కీమ్ కింద కచ్చితంగా లక్షాధికారుల్ని చేస్తామని బ్యాంక్ హామీ ఇస్తుంది. ఇక్కడ నెలనెలా మీరు ఎంచుకున్న నిర్ణీత మొత్తం డిపాజిట్ చేసుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. వేర్వేరు కాల వ్యవధులకు వేర్వేరు రకాల వడ్డీ రేట్లు ఉంటాయి. దీనిని బట్టి మెచ్యూరిటీకి మీకు రూ. 1 లక్ష వస్తుంది.
సాధారణ రికరింగ్ డిపాజిట్ స్కీంతో పోలిస్తే ఇది భిన్నం. అక్కడ నెలకు రూ. 500, రూ. 1000 ఇలా ప్రతి నెలా ఇంత ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లాలి. కానీ హర్ ఘర్ లఖ్పతీ స్కీం.. ప్రీ కాలిక్యులేటెడ్ రికరింగ్ డిపాజిట్ పథకం. మీ టార్గెట్ను బట్టి.. నెలకు ఎంత ఇన్వెస్ట్ చేయాలో నిర్ణయించుకోవచ్చు. రూ. 1 లక్ష కావాలంటే నెలకు ఇంత.. 5 లక్షలు కావాలంటే ఇంత.. అన్నట్లుగా ముందే తెలుసుకొని డిపాజిట్ చేయడం ద్వారా మెచ్యూరిటీకి మీ లక్ష్యాన్ని అందుకుంటారు.
ముఖ్య వివరాలు..
>> చిన్నమొత్తాల్లో డిపాజిట్ చేయడం ద్వారా రూ. 1 లక్ష ఆపైన అందుకునేందుకు అవకాశం కల్పిస్తోంది.
>> ఇది రికరింగ్ డిపాజిట్ విధానాన్ని పోలి ఉంటుంది.
>> భారతీయ నివాసితులు ఎవరైనా ఈ పథకంలో చేరొచ్చు. సింగిల్గా లేదా జాయింట్గా ఖాతా తెరవొచ్చు. పదేళ్లు దాటిన మైనర్ల పేరిట కూడా సొంతంగా అకౌంట్ తెరవొచ్చు.
>> మీ మెచ్యూరిటీ మొత్తాన్ని బట్టి.. నెలకు ఎంత ఇన్వెస్ట్ చేయాలో ముందే నిర్ణయించుకోవచ్చు.
>> కనీసం మూడేళ్లు.. గరిష్ఠంగా పదేళ్ల వరకు డిపాజిట్ చేయొచ్చు.
>> వరుసగా 6 నెలలు డిపాజిట్లు చేయకుంటే.. ఆ ఖాతా మూసేస్తారు. అప్పటి వరకు పోగైన మొత్తం.. సదరు వ్యక్తి బ్యాంక్ అకౌంట్కు పంపిస్తారు.
రూ. 1 లక్ష పొందాలంటే..
2025లో ఈ స్కీం లాంఛ్ చేసినప్పటితో పోలిస్తే ఇప్పుడు వడ్డీ రేట్లు తగ్గాయి. కనీసం ఒక్కో దానిపై 20 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లను బ్యాంక్ సైలెంట్గా తగ్గించేసింది. ఇక ఇక్కడ సాధారణ ప్రజలు, సీనియర్ సిటిజెన్లకు వడ్డీ రేట్లు వేర్వేరుగా ఉంటాయి. ఇవి కాల పరిమితిని బట్టి మారుతుంటాయని తెలుసుకోవాలి. సాధారణ ప్రజల కంటే సీనియర్లకు సాధారణంగా 50 బేసిస్ పాయింట్ల వరకు అధిక వడ్డీ ఆఫర్ చేస్తోంది.
ఉదాహరణకు మీకు రూ. 1 లక్ష ఒకేసారి కావాలంటే.. సాధారణ ప్రజలు మూడేళ్ల వ్యవధికి అయితే నెలకు రూ. 2,510 చొప్పున డిపాజిట్ చేస్తూ వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ 6.55 శాతం వడ్డీ రేటు చొప్పున అందిస్తుంది. సీనియర్ సిటిజెన్లకు అయితే 7.05 శాతం వడ్డీ రేటు అందిస్తుండగా.. ఇదే మొత్తానికి రూ. 2,500 జమ చేస్తే సరిపోతుంది. వీళ్లకు పెట్టుబడి కాస్త తగ్గుతుంది. స్టాఫ్కు రూ. 2,480 గానే ఉంది.
ఐదేళ్లలో రూ. 1 లక్ష పొందాలంటే సాధారణ ప్రజలు నెలకు రూ. 1420 చొప్పున డిపాజిట్ చేయాలి. ఇక్కడ వడ్డీ రేటు 6.30 శాతంగా ఉంది. సీనియర్ సిటిజెన్లు అయితే రూ. 1410 జమ చేయాలి. వీరికి వడ్డీ రేటు 6.80 శాతంగా ఉంది.
ఒకవేళ పదేళ్లలో రూ. 1 లక్ష కావాలంటే సాధారణ ప్రజలు ప్రతి నెలా రూ. 610 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. సీనియర్ సిటిజెన్లు ఇక్కడ రూ. 600 జమ చేయాలి. ఇదే విధంగా అన్ని కాల వ్యవధులపై వడ్డీ రేట్లు, డిపాజిట్ మొత్తం వేర్వేరుగా ఉంటుంది.
పూర్తి వివరాల కోసం ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ను సందర్శించండి.



































