కువైట్‌లోని అమెరికా ఎంబసీపై ఇరాన్‌ డ్రోన్‌ దాడి..!

ఇరాన్‌పై ఇజ్రాయెల్‌, అమెరికా సంయుక్త దాడులతో పశ్చిమాసియా అల్లకల్లోలంగా మారింది. తమ సుప్రీం లీడర్ ఖమేనీ హత్యకు ప్రతీకారంగా ఇరాన్‌ (Iran Strikes) దాడులు చేపట్టింది. దీంతో పరిస్థితులు మరింత దిగజారాయి. కువైట్‌లోని అమెరికా ఎంబసీపై ఇరాన్‌ డ్రోన్‌ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతంలో పొగ దట్టంగా అలముకుంది. అంబులెన్స్‌లు, అగ్నిమాపక యంత్రాలు అక్కడికి చేరుకున్నట్లు పలు అంతర్జాతీయ కథనాలు వెల్లడించాయి.


దుబాయ్‌, దోహాల్లో పేలుళ్లు..
మరోవైపు, ఇరాన్‌ డ్రోన్‌ దాడులతో బహ్రెయిన్‌ రాజధాని మనామాతో పాటు దుబాయ్‌, దోహా, అబుదాబిలోని పలు ప్రాంతాల్లో సోమవారం ఉదయం పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఇరాక్‌లోని ఎయిర్‌పోర్టు సమీపంలో రెండు డ్రోన్లను ఆ దేశ గగనతల రక్షణ వ్యవస్థలు కూల్చేశాయి. సైప్రస్‌లోని బ్రిటన్‌ నౌకాదళ స్థావరంపై డ్రోన్‌ దాడి జరిగింది. ఈ దాడిలో స్వల్ప నష్టమే జరిగిందని సైప్రస్‌ ప్రభుత్వం వెల్లడించింది. ఇక, ఇజ్రాయెల్‌లో సైరన్ల మోత మోగుతోంది. ఇరాన్‌ నుంచి వచ్చే క్షిపణులను తమ ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ అడ్డుకుంటోందని ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ వెల్లడించాయి.

అమెరికాతో చర్చల ప్రసక్తే లేదు: ఇరాన్‌
ఈసందర్భంగా యుద్ధం ఆపేందుకు మధ్యవర్తులతో ఇరాన్ సంప్రదింపులు జరుపుతోందంటూ వస్తోన్న వార్తలను ఇరాన్‌ నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ కార్యదర్శి అలీ లరిజానీ ఖండించారు. యుద్ధం విషయంలో అమెరికా (USA)తో చర్చలు జరిపే ప్రసక్తే లేదని ‘ఎక్స్‌’ వేదికగా స్పష్టంచేశారు. ‘‘ఈ దాడులను మేం మొదలుపెట్టలేదు. ట్రంప్ తన తప్పుడు ఆకాంక్షలతో ఈ ప్రాంతాన్ని సంక్షోభంలోకి నెట్టేశారు. ఇజ్రాయెల్‌ అధికార కాంక్ష కోసం అమెరికా సైనికులను బలి చేస్తున్నారు’’ అని అలీ లరిజానీ ఆగ్రహం వ్యక్తంచేశారు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.