పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో చమరు, గ్యాస్ సంక్షోభం కారణంగా ప్రపంచ దేశాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటున్నాయి. ఈ క్రమంలో అసలే అంతంత మాత్రం ఆర్థిక పరిస్థితి ఉన్న పాకిస్థాన్ దేశం ఇప్పుడు అట్టుడుకి పోతుంది. పాకిస్థాన్ లో లాక్ డౌన్ తరహా పరిస్థితులు కనిపిస్తున్నాయి. స్కూళ్లు, కాలేజీలు మూసివేశారు. ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని సూచించారు. విదేశీ పర్యటకులను అనుమతించడం లేదు. చమురు సంక్షోభం నుంచి బయట పడేందుకు ఈ మేరకు పాకిస్థాన్ ఈ చర్యలు తీసుకుంటోంది.
ఇరాన్, ఇజ్రాయెల్- అమెరికా యుద్ధం 13 రోజుకు చేరింది. అయితే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గడం లేదు. ఇజ్రాయెల్, అమెరికా స్థావరాలు లక్ష్యంగా ఇరాన్ దాడులకు పాల్పడుతోంది. మరోవైపు ఇరాన్ రాజధాని టెహ్రాన్ పై తాజాగా దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. అలాగే ఇరాన్ హార్మూజ్ జలసంధిని మూసి వేసింది. దాంతో చమురు సంక్షోభం మరింతగా ముదిరింది. ఆ ప్రభావం పాకిస్థాన్ పై పడింది. ప్రస్తుతం పాకిస్థాన్ లో ఉన్న పెట్రోల్, డీజిల్ నిల్వలు కేవలం 20 రోజులకు మాత్రమే సరిపోతాయి. ఈ ప్రమాదకర పరిస్థితుల్లో అక్కడి ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ రేట్లను ఒక్కసారిగా పెంచింది. ఒకేసారి లీటర్ పెట్రోల్ పై 20 శాతం పెంచింది. ప్రస్తుతం పాకిస్థాన్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 321 గా ఉంది. అలాగే లీటర్ డీజిల్ ధర రూ. 335 గా ఉంది. పెరిగిన ధరలపై ప్రజలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ముందు జాగ్రత్త చర్యగా వర్క్ ఫ్రం హోం ప్రకటించింది పాకిస్థాన్. ఇంటి నుండే పనులు చేసుకోవాలని.. ఆఫీసులకు రావొద్దని ఆదేశించింది. అలాగే దేశంలో ఇంధన కొరత కారణంగా 2 వారాల పాటు దేశంలోని అన్ని పాఠశాలలను మూసివేస్తున్నట్లు షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు హైయర్ ఎడ్యూకేషన్ సంస్థలు విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహించాలని సూచనలు చేసింది. అలాగే బ్యాంకులు మినహా.. మిగతా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు వారంలో కేవలం 4 రోజులు మాత్రమే పని చేయాలని ఆదేశాలు ఇచ్చింది. అలాగే 50 శాతం మంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని స్పష్టం చేసింది. తాజా నిర్ణయాల నేపథ్యంలో పాకిస్థాన్ లో లాక్ డౌన్ పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన మీమ్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
పెట్రోల్ కొరతను అధిగమించేందుకు పాకిస్థాన్ ప్రజలు పెట్రోల్ ను బాటిళ్లలో నింపుకుని ఇంట్లో భద్రపరుచుకున్న చిత్రాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరోవైపు నీటి కోసం కాకుండా పెట్రోల్ కోసం భారీగా క్యూలైన్లు కనిపిస్తున్న దృశ్యాలు వైరల్ గా మారాయి.

































