Gas Booking: గ్యాస్ సిలిండర్లపై కేంద్రం ఊహించని నిర్ణయం.. బుకింగ్స్‌పై మరో కఠిన రూల్..! ఒక్కొ కుటుంబానికి..

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఘోర యుద్దం క్రమంలో ప్రపంచవ్యాప్తంగా సరుకు రవాణాలో ముఖ్యపాత్ర పోషించే హార్ముజ్ జలసంధి మూతపడింది. ముడి చమురు, గ్యాస్ రవాణా స్తంభించిపోవడంతో దీని ప్రభావం అన్ని దేశాలపై పడుతుంది. అందులో భాగంగా భారత్‌లో గ్యాస్ కొరత ఏర్పడగా.. కేంద్ర ప్రభుత్వం పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అనేక చర్యలు చేపడుతోంది. ఈ పరిస్థితుల్లో గ్యాస్ బుకింగ్, సరఫరాపై అనేక రూల్స్ ప్రవేశపెడుతోంది. గ్యాస్ లభ్యతను పెంచడానికి 1955 నిత్యావసరాల చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ చట్టం వల్ల కేంద్రం గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లపై పరిమితులు విధించవచ్చు. ఇప్పటికే గ్యాస్ బుక్ చేసుకునేందుకు వెయిటింగ్ పీరియడ్ వంటి వాటిని విధించగా.. ఇదే పరిస్థితి కొనసాగితే త్వరలో కఠిన నిర్ణయాలు తీసుకోవచ్చు.


ప్రభుత్వానికి ఎలాంటి అధికారాలు ఉంటాయి..?
నిత్యావసరాల చట్టం కింద వస్తువుల పంపిణీ, సరఫరా, ఉత్పత్తిని నియంత్రించడానికి ప్రభుత్వానికి అధికారాలు ఉంటాయి. ఈ చట్టం ద్వారా ప్రభుత్వం ఏదైనా వస్తువు సరఫరా, ఉత్పత్తి, శుద్దిని తన నియంత్రణలోకి తీసుకోవచ్చు. సరఫరా గొలునును తమ కంట్రోల్‌లోకి తీసుకోవడంతో పాటు వివిధ రాష్ట్రాల్లో అవసరమైన వస్తువుల ఎలా పంపిణీ చేయాలనే విషయంపై ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవచ్చు. అలాగే ప్రజలకు ఇబ్బంది కలగకుండా వస్తువుల ధరలను, ధరలపై పరిమితులను కూడా ప్రభుత్వం విధింవచ్చు. ఇక నిల్వలను నియంత్రించేందుకు వ్యాపారులకు స్టాక్ పరిమితులు కూడా విధించే అధికారం కేంద్రానికి ఉంటుంది.

త్వరలో మరో కొత్త రూల్..?
గ్యాస్ కొరత క్రమంలో ప్రభుత్వం ఈ చట్టం ద్వారా ఇప్పటికే గ్యాస్ బుకింగ్ గుడువును పెంచింది. ఒక గ్యాస్ బుక్ చేసుకున్నాక మరో గ్యాస్ బుకింగ్ చేసుకోవడానికి 25 రోజుల గడువు పట్టణ ప్రాంతాల ప్రజలకు విధించింది. గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల గుడువు నిర్ణయించింది. ఇక త్వరలో గ్యాస్‌పై కేంద్రం రేషన్ కూడా విధించవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. అంటే ప్రతీ నెలా ఒక కుటుంబం కొనుగోలు చేసే గ్యాస్ సిలిండర్లపై పరిమితులు విధింవచ్చని చెబుతున్నారు. ఇక ఒక వ్యక్తి ప్రతీరోజు కొనుగోలు చేసే పెట్రోల్, డీజిల్‌ లీటర్ల సంఖ్యపై కూడా పరిమితులు విధించవచ్చు. గ్యాస్ సంక్షోభం మరింత తీవ్రతరం అయితే ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ చట్టంలోని సెక్షన్ 3 క్రింద ప్రభుత్వానికి విశేష అధికారులు ఉంటాయి. సరుకు లభ్యతను పెంచేందుకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు అయినా తీసుకోవచ్చు. 2020లో ఈ చట్టాన్ని సవరించగా.. అప్పటినుంచి కొన్ని అధికారులను పరిమితం చేశారు. వీటిని ఎప్పుడైనా అమలు చేయవచ్చు.