హెచ్-1బీ వీసా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఇటీవల ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఈ మేరకు రిజిస్ట్రేషన్ పోర్టల్స్ ను యూఎస్ సిటిజన్ షిప్, ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్ సీఐఎస్) ఇటీవల వీసా రిజిస్ట్రేషన్ల పోర్టల్ ను అందుబాటులో ఉంచింది.
మార్చి 19 వరకు హెచ్-1బీ వీసా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. హెచ్-1బీ వీసాలపై కొత్త రూల్స్ అందుబాటులోకి తీసుకొచ్చిన తర్వాత తొలిసారిగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే.
ఇక పలు కంపెనీలు అమెరికాలో కాకుండా ఇతర దేశాల నుంచి నిపుణులను తెచ్చుకోవాలంటే.. ఆ నిపుణులు ఎంపికైతే లక్ష డాలర్లు చెల్లించాలన్నది తొలి నూతన నిబంధనగా ఉంది. అలాగే అధిక జీతం తీసుకునే నిపుణులకు లాటరీ విధానం ద్వారా ప్రాధాన్యం ఉంటుంది. ఇక ప్రతి రిజిస్ట్రేషన్ కూ కంపెనీలు 215 డాలర్లను చెల్లించాల్సి ఉంటుంది. హెచ్-1బీ వీసాలకు భారీగా పోటీ నెలకున్న కారణంగా సంవత్సరానికి కేవలం 85 వేల వీసాలు మాత్రమే జారీ అవుతున్నాయి.
అయితే అమెరికా ప్రతినిధుల సభలో ఇటీవల WISA (Welcoming International Success Act) బిల్లును ప్రవేశపెట్టారు. డెమోక్రటిక్ కాంగ్రెస్ సభ్యురాలు బోనీ వాట్సన్ కోల్మన్ ఈ బిల్లును ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం ఏంటంటే..? హెచ్-1బీ వీసా రూల్స్ ను సులభతరం చేయడమే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్(MAGA) నినాదంలో భాగంగా విదేశీయులపై పలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అయితే తాజా బిల్లు చట్టంగా మారితే ఈ హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేసే అవకాశం ఉంటుంది.
కొత్త హెచ్-1బీ దరఖాస్తు దారులను స్పాన్సరింగ్ చేసే కంపెనీలపై గతంలో విధించిన లక్ష డాలర్ల ఫీజును రద్దు చేయాలని ఈ బిల్లులో పేర్కొన్నారు. అలాగే విదేశీ కార్మికులను నియమించుకునేందుకు వీలుగా పలు సవరణలు ఈ బిల్లులో ఉన్నాయి. అమెరికాలోని ఐటీ, వైద్యం, ఇంజినీరింగ్ రంగాల్లో నిపుణుల కొరతను తీర్చేందుకు ఈ బిల్లు ఉపయోగపడనుంది.
ఇక మొత్తం హెచ్-1బీ వీసాల్లో దాదాపు 75 శాతం భారతీయులకే లభిస్తున్న క్రమంలో ఈ బిల్లు చట్ట రూపం దాల్చితే భారతీయులకు ఎంతో మేలు చేసినట్లుగా భావించవచ్చు. అలాగే ప్రస్తుతం అమెరికాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులు చదువు పూర్తికాగానే ఉద్యోగ వీసాకు మారేందుకు ఈ బిల్లు సులభతరం చేస్తుంది. ప్రస్తుతం అమెరికాలో ఉన్న దాదాపు 7.3 లక్షల మంది హెచ్-1బీ వీసా హోల్డర్లు.. అలాగే దాదాపు 5.5 లక్షల మంది వారి కుటుంబ సభ్యులకు ఈ బిల్లు కారణంగా భద్రత లభించనున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

































