చంద్రబాబుకు భారీ ఊరట-గవర్నర్ అనుమతిపై ఏసీబీ కోర్టు కీలక నిర్ణయం..!

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయంగా పార్టీలు తీసుకునే నిర్ణయాలు ఓ ఎత్తు. కానీ ప్రభుత్వం దూకుడుగా విపక్షాలపై తీసుకునే నిర్ణయాలు మరో ఎత్తుగా మారుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఇవాళ ఓ కీలక కేసులో విజయవాడ ఏసీబీ కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే విపక్ష నేత చంద్రబాబుపై నమోదైన కేసుల విషయంలో అరెస్టును సమర్ధిస్తూ రిమాండ్ కు సైతం పంపిన కోర్టు.. ఇవాళ మాత్రం దానికి భిన్నంగా మరో నిర్ణయం తీసుకుంది.


టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసు తర్వాత సీఐడీ పలు కేసులు నమోదు చేసింది. వీటిలో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు కూడా ఒకటి. ఈ కేసులో చంద్రబాబుత పాటు మాజీ మంత్రి నారాయణ, లోకేష్, లింగమనేని రమేష్ వంటి వారిని నిందితులుగా చేర్చింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం అలైన్ మెంట్ లో అక్రమాల ద్వారా వీరంతా లబ్ధి పొందారని ఆరోపిస్తూ ఏసీబీ కోర్టులో ఇవాళ ఛార్జిషీట్ దాఖలు చేసింది.
దీనిపై విచారణ జరిపిన విజయవాడ ఏసీబీ కోర్టు.. సెక్షన్ 19ఏ ప్రకారం గవర్నర్ అనుమతి లేనిదే సీఐడీ ఛార్జిషీట్ దాఖలు చేసేందుకు వీల్లేదని తేల్చిసింది. ఈ మేరకు సీఐడీ ఛార్జిషీట్ ను తిరస్కరిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 19 ప్రకారం గవర్నర్ అనుమతి లేకుండా ఛార్జిషీట్ దాఖలు చేసేందుకు వీల్లేదని స్పష్టం చేసింది. దీంతో చంద్రబాబుతో పాటు నారా లోకేష్, మాజీ మంత్రి నారాయణకు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఎన్నికల వేళ ఊరట లభించినట్లయింది.