YS Jagan: ఫారిన్ టూర్‎కు ఏపీ సీఎం జగన్.. ఫ్యామిలీ వెకేషన్‎ ఎన్ని రోజులంటే..

జగన్ విదేశీ టూర్‎కు సీబీఐ కోర్ట్ అనుమతి ఇచ్చింది. మే 17 నుండి జూన్ 1 వరకు సీఎం జగన్ విదేశీ టూర్ కు వెళ్లనున్నారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ గత రెండు నెలల నుంచి ప్రజల మధ్యే తిరుగుతూ ప్రచారాన్ని హోరెత్తించారు.
అయితే మే 13న 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ పూర్తి అయింది. జూన్ 4న ఫలితాలు విడుదల కానున్నాయి. ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత ఖాళీ సమయం, తీరిక దొరకదని భావించి చాలా మంది పొలిటికల్ లీడర్స్ రిలాక్స్ మూడ్ లోకి వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే సీఎం జగన్ కూడా తన సతీమణి వైఎస్ భారతితో కలిసి లండన్ కు వెళ్లనున్నారు. అక్కడ తన కుమార్తెతో సరదాగా గడిపేందుకు కుటుంబంతో కలిసి వెళ్లే క్రమంలో హైదరాబాద్ నాంపల్లి సీబీఐ కోర్టును అనుమతి కోరుతూ పిటిషన్ వేశారు. అయితే దీనిపై గత వారం వాదోపవాదనలు జరిగాయి. మే 15న సీబీఐ కేసు విచారణకు వస్తున్న నేపథ్యంలో అనుమతి ఇవ్వకూడదని సీబీఐ తరఫు న్యాయవాదులు వాదించారు.


అయితే సీఎం జగన్ తరఫు న్యాయవాదులు కూడా అందుకు కౌంటర్ చేశారు. జగన్ ఒక రాజకీయ పార్టీని నడుపుతున్నారని, ప్రస్తుతం ఆయన రాజ్యంగబద్దమైన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారని, ఆయనను నమ్ముకుని ఒక రాష్ట్రంతో పాటు పార్టీ నేతలు ఉన్నారని కోర్టుకు తెలిపింది. దీనిపై వాదనలు విన్న సీబీఐ న్యాయమూర్తి తీర్పును మే 14కు వాయిదా వేశారు. తిరిగి ఈరోజు తీర్పు వెలువరించే క్రమంలో సీఎం వైఎస్ జగన్ కు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. చట్టంలోని రైట్ టు ట్రావెల్ అబ్రాడ్ ప్రకారం బెయిల్ లో ఉన్న వ్యక్తికి అతని పరిస్థితులు, ప్రవర్తనను బట్టి విదేశాలకు వెళ్లేందుకు అవకాశం కల్పించవచ్చని తెలిపింది. దీంతో మే 17 నుంచి జూన్ 1 వరకు లండన్ వెళ్లేందుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కుటుంబం‎తో కలిసి వెకేషన్‎కు విదేశాలకు వెళ్లేందుకు సీఎం జగన్ కోరిన అనుమతిని మంజూరు చేసింది. సీబీఐ కేసుల్లో బెయిల్ మీద ఉన్న సీఎం జగన్ ఇప్పటికే చాలా సార్లు ఇలా అనుమతి తీసుకుని లండన్, దావోస్ వెళ్లారు. గతంలో తన కుమార్తె పెద్ద చదువుల నిమిత్తం ఆమెను లండన్ లో విడిచిపెట్టి వచ్చేందుకు కూడా తోడుగా వెళ్లారు. ఇలా చాలా సార్లు సీఎం జగన్ విదేశాలకు వెళ్లి తిరిగి కోర్టు చెప్పిన గడువులోపు తిరిగి రావడంతో ఈ సారి కూడా విదేశాలకు వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కోర్టు.