AP TS Weather Updates : ఏపీ, తెలంగాణలో భానుడి భగభగలు – ఈ జిల్లాలకు ‘ఎల్లో’ హెచ్చరికలు

AP Telangana Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. తెలంగాణలో అయితే..సాధారణం కన్నా 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ కాగా… ఏపీలోని పలు మండలాలకు వడగాల్పుల హెచ్చరికలు జారీ అయ్యాయి.
ఏపీ తెలంగాణలో భానుడి ప్రతాపం పెరిగింది. 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 9 దాటితే చాలు…మాడుపగిలేలా ఎండలు దంచుతున్నాయి.
తెలంగాణలోని పలు జిల్లాలకు హెచ్చరికలను జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. 3 రోజుల పాటు వడగాల్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు ఎల్లో హెచ్చరికలను ఇచ్చింది.
ఇవాళ(మార్చి 31) ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఏప్రిల్‌ 1వ తేదీన ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, కామారెడ్డి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీస్తాయని తెలిపింది.
ఇక ఏపీలోనూ ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. సీమ జిల్లాల్లో పరిస్థితి మరి ఎక్కువగా ఉంది. ఇవాళ (ఆదివారం) 33 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మార్చి 30వ తేదీన 07 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 52 మండలాల్లో వడగాల్పులు వీచినట్లు వివరించింది.
ఏప్రిల్ 1వ తేదీన ఏపీలోని 64 మండలాల్లో వడగాల్పులు, ఒక మండలంలో తీవ్రవడగాల్పు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలంతా అలర్ట్ గా ఉండాలని వాతావరణశాఖ సూచించింది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. మధ్యాహ్నం సమయంలో బయటికి వెళ్లొద్దని పేర్కొంది.