UPI చెల్లింపులు చేస్తున్నారా?..పెద్ద ముప్పే ఉందట..సర్వేలు ఏం చెబుతున్నాయంటే..

దేశంలో ఎక్కువ మంది ప్రజలు UPI ద్వారా డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారు. రోజువారీ అవసరాలు మాత్రమే కాకుండా ఖరీదైన హోం అప్లియెన్స్, గాడ్జెట్స్, డిజైనర్ క్లాత్స్ వంటి ఇతర వస్తువుల కొనుగోలుకు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్(UPI) ని ఉపయోగిస్తున్నారు.


అయితే UPI ద్వారా చాలా ఈజీగా, త్వరగా డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నందున వృధా ఖర్చుకు దారితీస్తుందని సర్వేలు హెచ్చరిస్తున్నాయి. అదేంటో చూద్దాం..

ఇటీవల ఐఐఐటీ ఢిల్లీ నిర్వహించిన సర్వే ప్రకారం.. దేశంలోని దాదాపు 74 శాతం మంది UPI , ఇతర డిజిటల్ చెల్లింపులు చేయడం ద్వాారా అతిగా ఖర్చు చేస్తున్నారట. యూపీఐ ద్వారా డిజిటల్ లావాదేవీలు ఈజీగా ఉన్నా.. క్యాస్ పేమెంట్లతో పోలిస్తే.. డిజిటల్ లావాదేవీల ద్వారా అధికంగా ఖర్చు చేస్తున్నట్లు తేలింది.

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఇటీవల డేటా ప్రకారం.. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (UPI) ద్వారా జరిపిన లావాదేవీలు.. 1330 కోట్లకు చేరింది. ఇది సంవత్సర ప్రాతిపదిక చూస్తే.. యూపీఏ లావాదేవీలలో 50 శాతం పెరుగుదలను సూచిస్తుంది. గతేడాది యూపీఐ లావాదేవీలు దాదాపు 60 శాతం పెరిగి రికార్డు స్తాయిలో 11,768 కోట్లకు చేరుకుంది. మొబైల్ లావాదేవీలలో గణనీయమైన వృద్ధి కారణంగా UPI విస్తృత మార్జిన్‌తో మొదటి స్థానంలో ఉందట. ఇది స్మార్ట్ ఫోన్ ద్వారా చెల్లింపులపై కస్టమర్లకు పెరుగుతున్న నమ్మకాన్ని స్పష్టం చేస్తుంది.

UPI లావాదేవీల సగటు టిక్కెట్ పరిమాణం (ATS) రూ. 1,648 నుండి రూ. 1,515కి 8% తగ్గింది. కార్లు, స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలు, ఇతర వస్తువులను కొనుగోలు చేయడం వల్ల భారతదేశంలో కస్టమర్ల వ్యయం పెరుగుతోందని, ఇది దేశ ఆర్థిక వృద్ధికి దోహదపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

అయినప్పటికీ ఈ ధోరణి UPI కారణంగా కొంతమంది ఖరీదైన వస్తువులపై అధికంగా ఖర్చు చేయడానికి దారితీస్తుందని అమెజాన్ ఇండియా తరపున నీల్సన్ మీడియా ఇండియా ఇటీవలి నివేదిక వెల్లడించింది. 42శాతం కస్టమర్లు ఆన్‌లైన్ పండుగ షాపింగ్ కోసం UPIని ఉపయోగిస్తారని తేలింది. దేశంలో డిజిటల్ చెల్లింపు పద్ధతులు మరింత ఆదరణ పొందుతున్నాయని సూచిస్తున్నాయి.