Tirupati: పులివర్తి నానిపై దాడి.. తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తత

తిరుపతి: చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై వైకాపా మూక దాడి ఘటనతో తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.


దాడి సమాచారం తెలుసుకున్న తెదేపా శ్రేణులు పద్మావతి మహిళా వర్సిటీ వద్దకు భారీగా చేరుకున్నారు. నానికి మద్దతుగా నిరసన తెలిపేందుకు వచ్చిన కార్యకర్తలపై పోలీసుల లాఠీ ఛార్జి చేయడంతో వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దాడి చేసిన నిందితులను వదిలేసి తమపై పోలీసులు లాఠీ ఛార్జి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి పోలీసులు తొత్తులుగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. దీంతో మంగళవారం మధ్యాహ్నం నుంచి తిరుపతి రణరంగంగా మారింది. మీడియా ప్రతినిధులపై కూడా పోలీసులు లాఠీ ఝుళిపించడంతో వారు కూడా నిరసనకు దిగారు. సీఐ రామచంద్రారెడ్డి తీరుకు నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.

ఒక్కసారిగా దాడి

నానితో పాటు ఆయన సతీమణి పులివర్తి సుధారెడ్డిపై కొంతమంది వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. పద్మావతి మహిళా యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. స్ట్రాంగ్ రూము వద్ద ఈవీఎంలను తారుమారు చేసే యత్నం జరుగుతున్నట్టు సమాచారం రావడంతో పులివర్తి నాని అక్కడకు వచ్చారు. ఈ సమయంలో వైసీపీ కార్యకర్తలు భారీగా ఉండటం చూసిన నాని వారిని ప్రశ్నించారు. అయితే ఈ సమయంలో వారు ఒక్కసారిగా నానిపై దాడికి పాల్పడ్డారు.

ఈ ఘటనలో నాని భద్రతా సిబ్బందికి గాయాలవ్వగా, కారు ధ్వంసమైంది. దాడిని నిరసిస్తూ కూటమి నేతలు వర్సిటీ ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. పులివర్తి నాని కారు ధ్వంసం, గన్‌మెన్ ధరణికి తీవ్ర గాయాలయ్యాయి. 150 మందికిపైగా రాడ్లు, కత్తులతో వచ్చి దాడి చేసి భయాభ్రాంతకులకు గురిచేశారని ఎన్డీఏ కూటమి నేతలు ఆరోపించారు.

నడవలూరు సర్పంచి గణపతి, రామాపురానికి చెందిన వైసీపీ నేత భాను అతని అనుచరుల ఆధ్వర్యంలో ఈ దాడి జరిగిందని వాపోయారు. ఈ ఘటనను చెవిరెడ్డి పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ఓటమి భయంతోనే దాడులకు దిగారని విరుచుకుపడ్డారు. చెవిరెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దాడికి పాల్పడిన వైసీపీ మూకలను అరెస్టు చేసే వరకు ఆందోళన విరమించేది లేదని కూటమి నేతలు, కార్యకర్తలు స్పష్టం చేశారు.

దాడి సమాచారం తెలుసుకున్న ఎన్డీఏ కార్యకర్తలు మహిళా వర్సిటీ ప్రాంగణానికి చేరుకున్నారు. నిందితులు అక్కడే ఉన్నారనే సమాచారంతో పద్మావతి మహిళా వర్సిటీ చెట్టు పక్కల గాలింపు చర్యలు చేపట్టారు. దాడి జరిగిన ప్రాంతంలో ఉన్న ఓ కారులో వైసీపీ జెండాలు, మద్యం బాటిళ్లు, మారణాయుధాలు ఉండటంతో ఆ కారును ధ్వసం చేశారు.

మహిళా విశ్వవిద్యాలయం ప్రాంగణంలో స్ట్రాంగ్‌ రూమ్‌ ఏర్పాటు చేసిన ప్రదేశంలో వైసీపీ గూండాలు మారణాయుధాలతో యథేచ్ఛగా తిరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని నాని, కూటమి నేతలు ప్రశ్నించారు. ఈ ఘటనతో మహిళా వర్సిటీ ప్రాంగణం రణరంగంలా మారింది. భారీగా పోలీసు బలగాలు చేరుకుని పరిస్థితిని అదుపు చేశాయి. ఈ ఘటనతో స్ట్రాంగ్ రూం వద్ద భద్రతపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా.. ఈ ఘటనపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసేందుకు టీడీపీ నేతలు సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది.