BLA vs PAK | పాకిస్థాన్‌, బలూచిస్తాన్‌ మధ్య తీవ్ర ఘర్షణలు.. 22 మంది పాక్‌ సైనికులు మృతి

BLA vs PAK : పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ప్రస్తుతం భారత్‌-పాకిస్థాన్‌ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఉగ్రదాడిని ఖండించకపోవడమేగాక రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న పాకిస్థాన్‌పై భారత్‌ గుర్రుగా ఉంది.


ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తూ దాడులకు ఉసిగొల్పుతున్న పాకిస్థాన్‌కు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో పాకిస్థాన్‌, బలూచిస్థాన్‌ మధ్య తీవ్ర ఘర్షణలు చెలరేగాయి.

బలూచిస్థాన్‌ లిబరేషన్‌ ఆర్మీ పాకిస్థాన్‌ ఆర్మీపై మెరుపుదాడి చేసింది. ఈ దాడిలో 22 మంది పాకిస్థాన్‌ సైనికులు మృతిచెందారు. పాక్‌ సైన్యం చేసిన ప్రతిదాడిలో బలూచిస్థాన్‌ లిబరేషన్‌ ఆర్మీకి చెందిన ఆరుగురు మరణించారు. పాకిస్థాన్‌లోని కొన్ని పట్టణాల్లో బలూచ్‌ లిబరేషన్‌ ఆర్మీ పాగా వేసినట్లు సమాచారం. కాగా బలూచిస్థాన్‌ పాకిస్థాన్‌లోని అతిపెద్ద ప్రావిన్స్‌. అయితే జనాభాపరంగా చూస్తే అతి తక్కువ జనాభా కలిగిన ప్రావిన్స్‌.

బలూచిస్తాన్‌లో ఎడారి ప్రాంతం ఎక్కువ. దాంతో అక్కడి ప్రజలు బలూచ్‌ జాతీయులు. ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు. దాంతో అక్కడి ప్రజలను పాకిస్తాన్‌ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోదు. ఈ నేపథ్యంలో బలూచ్‌ జాతీయుల హక్కుల కోసం బలూచిస్థాన్ లిబరేషన్‌ ఆర్మీ ఏర్పాటై పాకిస్థాన్‌తో పోరాటం చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా పాక్‌ సైన్యంపై బీఎల్‌ఏ దాడి చేసింది.