చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్, ఆ తర్వాత కూడా హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి. ఎప్పుడు ఎవరి మీద ఎటువంటి దాడులు కొనసాగుతాయన్నది అర్థంకాని పరిస్థితి ఉంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నేతల మీద ఏపీలో అక్కడక్కడ దాడులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఏపీలో చంద్రబాబు నాయుడు భద్రత విషయంలో టిడిపి శ్రేణుల్లో ఆందోళన కనిపిస్తుంది.


చంద్రబాబుకు భద్రత పెంచిన కేంద్రం
ఇక చంద్రబాబుకు ఎన్నికల ముందు ప్రచారం నిర్వహించే క్రమంలో కూడా ఆయన భద్రత విషయంలో అనేకమార్లు రాజకీయ వర్గాలలో చర్చ జరిగింది. ఏపీలో చంద్రబాబుకు భద్రతపై ఆందోళనల క్రమంలో, దీంతో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు కేంద్రం భద్రతను పెంచింది. గత రెండు రోజులుగా కేంద్రం నుంచి వచ్చిన ముఖ్య భద్రత అధికారులు చంద్రబాబు నివాసం వద్ద ఆయన సంచరించే అన్ని ప్రదేశాలను పరిశీలించారు.

24 మంది ఎస్పీజీ బ్లాక్ క్యాట్ కమాండోలతో చంద్రబాబుకు భద్రత
తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద, కరకట్ట వద్ద, చంద్రబాబు నాయుడు నివాసం వద్ద, అలాగే గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి కరకట్ట మార్గాలు తదితర ప్రదేశాలను పరిశీలించారు. చంద్రబాబు భద్రతకు భంగం వాటిల్లకుండా , చంద్రబాబు నాయుడుకి భద్రత పెంచాల్సిన అవసరాన్ని గుర్తించిన అధికారులు ఈ మేరకు చంద్రబాబు నివాసం వరకు 12 ×12 రెండు బ్యాచులు గా 24 మంది ఎస్పీజీ బ్లాక్ క్యాట్ కమాండోలను కేటాయించారు.

చంద్రబాబుకు ఎందుకింత భద్రత
ప్రస్తుతం చంద్రబాబుకు ఇంత ఎందుకు భద్రత పెంచారు అన్నది రాజకీయ వర్గాలలో ఆసక్తికర చర్చగా మారింది. ఆయనకు ఏమైనా ప్రమాదం పొంచి ఉందా? ఇంటిలిజెన్స్ నివేదికలు ఇచ్చిందా? ఎందుకీ భద్రత పెంపు అన్నది ఆసక్తిగా మారింది. ఒకపక్క ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ లకు రక్షణ తగ్గించిన కేంద్రం, ప్రస్తుతం చంద్రబాబుకు రక్షణ పెంచటం ఢిల్లీ పొలిటికల్ వర్గాలలో ఆసక్తికర చర్చకు కారణంగా మారింది.

ఏపీలో హింసాత్మక ఘటనలతో ఆందోళన
ఇక ఏపీలోనూ తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు, హింసాత్మక ఘటనలు, టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య కొనసాగుతున్న దాడులు, అభ్యర్థుల పైన కూడా కొనసాగుతున్న ఎటాక్ లు వెరసి జూన్ నాలుగు వరకు శాంతి భద్రతల విషయంలో ఏపీలో కొనసాగుతున్న ఆందోళనల నేపధ్యంలో చంద్రబాబుకు భద్రత పెంపు ప్రాధాన్యత సంతరించుకుంది.