‘పుష్ప2’ విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో సినీ నటుడు అల్లు అర్జున్ (Allu Arjun) అరెస్టయి ఆ తర్వాత బెయిల్పై విడుదలైన సంగతి తెలిసిందే.
తొక్కిసలాట ఘటన, తదనంతర పరిణామాలు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఈ వ్యవహారంపై తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి అసెంబ్లీ వేదికగానే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తాజాగా దావోస్ పర్యటనలో ఉన్న ఆయన ఆంగ్ల మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు రేవంత్ రెడ్డి మరోసారి స్పందించారు.
తొక్కిసలాట ఘటనకు అల్లు అర్జున్ నేరుగా బాధ్యుడు కాదు కదా అని ప్రశ్నించగా.. ”రెండు రోజుల ముందు అనుమతి కోసం వస్తే.. పోలీసులు నిరాకరించారు. అయినా థియేటర్ వద్దకు అల్లు అర్జున్ వచ్చారు. ఈ క్రమంలో భారీగా అభిమానులు తరలిరావడంతో ఆయనతో వచ్చిన సెక్యురిటీ సిబ్బంది అక్కడున్న వారిని తోసేశారు. ఆ తొక్కిసలాటలో ఒకరు చనిపోయారు. ఒక మనిషి చనిపోవడమన్నది ఆయన చేతుల్లో లేకపోవచ్చు. ఒక మహిళ చనిపోతే, 10-12 రోజులు బాధిత కుటుంబాన్ని పట్టించుకోలేదు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది” అని అన్నారు.