Cyber Crime: అయోధ్యకు వీఐపీ టికెట్లు కావాలా.. లింక్‍లు పంపుతున్న సైబర్ నేరగాళ్లు.. క్లిక్ చేస్తే అంతే..

జనవరి 22 తేదీ కోసం యావత్ భారతదేశం ఎదురు చూస్తోంది. ఆ రోజు అయోధ్య రామమందిరం ప్రారంభం కానుంది. గుడి ప్రారంభోత్సవానికి మరో 9 రోజులే గడువు ఉండటంతో ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
శ్రీరాముడి ప్రతిష్ఠాపన ప్రధాని మోదీ చేతుల మీదుగా నిర్వహించనున్నారు. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు తరలి రానున్నారు. ఈ క్రమంలో అయోధ్యకు ట్రైన్, బస్, విమాన ప్రయాణాలు పెరిగాయి.


రాముడి చూడాలని ఆశతో ఉన్న భక్తులే టార్గెట్ గా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అయోధ్యకు రామమందిర ప్రారంభోత్సవానికి వీఐపీ టికెట్లు కావాలా అంటూ మోసాలకు పాల్పడుతున్నారు. వీఐపీ టికెట్ కావాలా అంటూ సాధారణ మెసేజ్ లు, వాట్సాప్ మెసేజ్ ల్లో లింక్ లు పంపుతున్నారు.

ఇక మరికొందరైతే డైరక్ట్ ​గా ఈ ఏపీకే ఫైల్​ ను డౌన్​లోడ్​ చేసుకుంటే వీఐపీ యాక్సెస్‌ దొరుకుతుందని మోసాలకు పాల్పడుతున్నారు. సైబర్ నేరగాళ్లు పంపిన లింక్ లు క్లిక్ చేస్తే అంతే సంగతి అని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

 

ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రజలను అప్రమత్తం చేశారు. మీ వ్యక్తిగత వివరాలు, బ్యాంక్​ వివరాలన్నీ తస్కరించి మోసాలకు తెగబడుతారని, జాగ్రత్తగా ఉండాలని కోరారు. కాగా అయోధ్యరామందిరానికి సంబంధించి దర్వాజాలను హైదరాబాద్ కు చెందిన ఓ టింబర్ డిపో వారు తయారు చేశారు. అలాగే శ్రీరాముడి పాదుకలను హైదరాబాద్ కు చెందిన పిట్టంపల్లి రామలింగా చారి తయారు చేశారు. రామ పాదుకల కోసం పంచ లోహాలను ఉపయోగించారు.
అయోధ్యలో ఈ నెల 22న శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకల నేపథ్యంలో ప్రధాని మోదీ శుక్రవారం ప్రత్యేక దీక్షను ప్రారంభించిన సంగతి తెలిసిందే. 11 రోజుల పాటు తాను నియమ నిష్టలతో ఉంటానని మోడీ పేర్కొన్నారు.