కేరళ (Kerala) రాష్ట్రం తిరువనంతపురంలో ఓ వ్యక్తి జీవ సమాధి అంశం వివాదాస్పదంగా మారింది.
తిరువనంతపురం: కేరళ (Kerala) రాష్ట్రం తిరువనంతపురంలో ఓ వ్యక్తి జీవ సమాధి అంశం వివాదాస్పదంగా మారింది. స్థానికులు అతడి మరణంపై ఫిర్యాదు చేయగా పోలీసులు సమాధిని తవ్వడానికి వెళ్లారు. అయితే కుటుంబ సభ్యులు అడ్డుకోవడంతో ఈ అంశం హైకోర్టుకు చేరింది. ఆ సమాధిని తవ్వాల్సిందేనని హైకోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
గోపన్ స్వామి అలియాస్ మణ్యన్ జీవ సమాధి అయ్యారని కొద్ది రోజుల క్రితం ఆయన కుటుంబీకులు పోస్టర్లు ప్రచురించారు. బంధువులు, స్థానికులకు తెలియకుండా అతన్ని నెయ్యటింకరలోని ఓ దేవాలయం సమీపంలో పూడ్చిపెట్టడం అనుమానాలకు తావిచ్చింది. ఎవరూ చూడకుండా తనను సమాధి చేయాలని గోపన్ చెప్పినట్లు ఆయన కుమారులు సనందన్, రాజేశన్ చెబుతుండటం మిస్టరీగా మారింది. ఇందులో ఏదో మతలబు ఉందని స్థానికులతోపాటు, మృతుడి బంధువులు సైతం ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా.. వారు కలెక్టర్కు నివేదిక పంపించారు. తొలుత సబ్ కలెక్టర్ ఆల్ఫ్రెడ్ ఓవీ తన సిబ్బందితో వెళ్లి సమాధిని తవ్వాలని ఆదేశించారు. ఈ చర్యను గోపన్ స్వామి భార్య, కుమారులు అడ్డుకున్నారు. సమాధిని తవ్వడానికి వీల్లేదని అడ్డుపడ్డారు. అయితే స్థానికులు మాత్రం సమాధిని తవ్వి తీరాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో అధికారులు న్యాయపరంగా ముందుకెళ్లారు. సమాధిని తవ్వాలని హైకోర్టు ఆదేశించడంతో మరోసారి ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ నమ్మకాలను కాపాడాలని సనందన్ హిందూ సంస్థలకు విజ్ఞప్తి చేశారు.
ఎవరికీ తెలియకుండా గోపన్ స్వామి చనిపోవడంపై తమకు అనుమానం ఉందని స్థానికుడొకరు తెలిపారు. కనీసం బంధువులకైనా సమాచారం ఇవ్వాలి కదా అని ప్రశ్నించారు. మృతుడికి కంటి చూపు సరిగా లేదని అలాంటి వ్యక్తి తనకు తానుగా జీవ సమాధి ఎలా అవుతారని సందేహం వ్యక్తం చేశారు. రెండేళ్లుగా ఇంట్లో నుంచి బయటకు రాని మనిషి అకస్మాత్తుగా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంటే నమ్మశక్యంగా లేదన్నారు.