Dr.Krishna Ella : తెలుగు సైంటిస్ట్‌కు ప్రతిష్టాత్మక పురస్కారం!

Dr. Krishna Ella : ప్రజారోగ్యరంగంలో విశిష్ట సేవలు అందించే వారికి ఇచ్చే జాన్స్‌ హాప్కిన్స్‌ బ్లూమ్‌బెర్గ్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ డీన్‌ పురస్కారాన్ని భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక‍్టర్‌ కృష్ణ ఎల్లా అందుకున్నారు. అమెరికాలోని మేరీల్యాండ్‌ బాల్టిమోర్‌లో మే 22న జరిగిన బ్లూమ్‌బర్గ్‌ స్కూల్ కాన్వొకేషన్ వేడుకలో డీన్‌ ఎల్లెన్ జె.మెకెంజీ చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు.


ప్రజారోగ్యానికి చేసిన కృషికి గుర్తింపు..
భారత్‌ బయోటెక్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్న్‌ కృష్ణ ఎల్లా ప్రజారోగ్యానికి చేసిన కృషిని గుర్తించి ఈ పురస్కారం ప్రధానం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. కరోనా సమయంలో వ్యాక్సిన్‌ అభివృద్ధి చేసి కోవిడ్‌ తీవ్రతను తగ్గించారని తెలిపారు.

భారత్‌కు అంకితం..
పురస్కార గ్రహీత కృష్ణ ఎల్ల మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా సైన్స్ అండ్ రిసెర్చ్‌లో ఎన్నో విజయాలు సాధించిన భారత్‌కు ఈ పురస్కారం అంకితం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ పురస్కారం భారత శాస్త్రవేత్తల బృందానికి దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. మోనోక్లోనల్‌ యాంటీబాడీల అభివృద్ధి కోసం భారత్‌ బయోటెక్‌ ఎనో‍్న పరిశోధనలు చేసి వ్యాక్సిన్‌ రూపొందించిందని తెలిపారు.

125 దేశాలకు వ్యాక్సిన్‌..
ఇదిలా ఉండగా డాక్టర్‌ ఎల్లా నేతృత్వంలోని భారత్‌ బయోటెక్‌ 220 పెటెంట్లు, 20 వ్యాక్సిన్లు, బయో థెరప్యూటిక్స్‌ కలిగి ఉంది. కోవిడ్‌ సమయంలో కోవ్యాగ్జిన్‌ వ్యాక్సిన్లు ఉత్పత్తి చేసింది. కోవిడ్‌ నియంత్రణలో దేశీయంగా తయారు చేసిన వ్యాక్సిన్‌ ఇదే. హైదరాబాద్‌తో తయారు చేసిన వ్యాక్సిన్లను 125 దేశాలకు సరఫరా చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 9 బిలియన్‌ వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసింది.