ఏపీకి గుడ్ న్యూస్.. రూ.10 వేల కోట్లతో భారీ ప్రాజెక్టు

విభజనతో ఆర్థిక కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)కు భారీ గుడ్ న్యూస్ లభించింది. రూ. 10 వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు రిలయన్స్ సంస్థ(Reliance Company) ముందుకు వచ్చింది.


ఆసియాలోనే అతి పెద్ద సౌర ప్రాజెక్టును కర్నూలు జిల్లాలో ప్రారంభించేందుకు సంసిద్ధంగా ఉంది. 930 మెగా వాట్ల సోలార్ విద్యుత్ ఫ్లాంట్ తో పాటు 465 మెగా వాట్ల బ్యాటరీ స్టోరేజీ ప్లాంట్ ను కూడా ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు రిలయన్స్ ఎస్‌యూ సన్ టెక్ సంస్థ ప్రతినిధులు ఇప్పటికే కర్నూలు జిల్లాలో భూములను పరిశీలించారు. రెండు స్థలాలను ఖరారు చేశారు.

దీంతో ఏదో ఒక స్థలంలో అతి త్వరలోనే ఈ ప్రాజెక్టు పనులను రిలయన్స్ సంస్థ ప్రారంభించే అవకాశం ఉందని అధికార వర్గాలు ప్రకటించాయి. ఈ ప్రాజెక్టు ప్రారంభిస్తే ప్రత్యక్షంగా వెయ్యి మందికి, పరోక్షంగా మరో 2 వేల మందికి ఉపాధి లభిస్తుందని అధికారులు వెల్లడించారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన ఒప్పందాన్ని పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. బీఓటీ విధానంలో ఈ సోలార్ విద్యుత్ ప్రాజెక్టును రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను వివిధ విద్యుత్ సంస్థలకు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు.