Heart attack: వీటివల్లే యువకుల్లో గుండెపోటు ప్రమాదం పెరుగుతోంది.. అవేంటంటే..

ప్రస్తుతం గుండె సంబంధిత సమస్యల బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. మరీ ముఖ్యంగా యువత గుండె పోటు బారిన పడుతుండడంతో అందరిలో ఆందోళన కలిగిస్తోంది.
చిన్న వయసు వారే గుండెపోటుతో మరణిస్తుండడం వైద్యులను సైతం కలవరపెడుతోంది. భారత్‌లో ఈ మధ్య కాలంలో ఇలాంటి కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. మారుతోన్న జీవన ప్రమాణాలు, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా హృద్రోగ సమస్యలు ఎక్కువవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇక యువకుల్లో గుండె సమస్యలకు రావడానికి గల కొన్ని కారణాలను వివరిస్తున్నారు.


ఈ మధ్య కాలంలో గుండె పోటు బారిన పడుతున్న వారిలో అత్యధికులు 50 ఏళ్ల లోపు వారే ఉన్నారని వైద్యులు చెబుతున్నారు. వీరిలో కొందరు సైలెంట్ అటాక్ కారణంగా చనిపోతున్నారని హెచ్చరిస్తున్నారు. అయితే మంచి జీవనశైలితో గుండెను సంరక్షించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మంచి జీవన శైలితో గుండె జబ్బులు, మధుమేహం, రక్తపోటు ప్రమాదాన్ని 80 శాతానికి పైగా తగ్గించవచ్చని చెబుతున్నారు.
జీరో షుగర్‌తో కూడిన సమతుల్య ఆహారం తీసుకుంటే మేలని సూచిస్తున్నారు. ముఖ్యంగా గోధుమల వినియోగాన్ని తగ్గించి మినుము, జొన్న, మొక్కజొన్న, శనగ, రాగులు, సోయాబీన్ వంటి వాటిని ఆహారంలో భాగం చేసుకోవలని చెబుతున్నారు. ప్రోటీన్‌ లభించే ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకుంటూ.. నూనె, నెయ్యిని తక్కువ పరిమాణంలో తీసుకోవాలని సూచిస్తున్నారు.

ఇక గుండె ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా వ్యాయామాన్ని అలవాటుగా మార్చుకోవాలని సూచిస్తున్నారు. కచ్చితంగా ప్రతీ రోజూ 10 వేల అడుగులు నడవాలనే నియమాన్ని పాటించాలని చెబుతున్నారు. ఇక అదే పనిగా కూర్చునే సమయాన్ని 50 శాతం తగ్గిస్తే రోగాలను 50 శాతం తగ్గించుకోవచ్చని చెబుతున్నారు. వీలైనంత వరకు ప్రతీ రెండు గంటలకు ఒకసారైనా లేచి అటు, ఇటు నడవాలని సూచిస్తున్నారు. ఇక కండరాలను బలోపేతంగా ఉంచుకోవడానికి పుష్ అప్స్, వెయిట్ లిఫ్టింగ్ తదితర కొన్ని వ్యాయామాలు అవసరమని చెబుతున్నారు.
సూర్య నమస్కార్ మొత్తం ఫిట్‌నెస్ కోసం ఉత్తమ వ్యాయామమని చెబుతున్నారు. ఒత్తిడి తగ్గించే యోగా, మెడిటేషన్‌ వంటి వాటిని అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే స్మోకింగ్, ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలని చెబుతున్నారు. స్మార్ట్‌ ఫోన్‌, ల్యాప్‌టాప్‌ వంటి గ్యాడ్జెట్లకు సమయాన్ని తగ్గించాలని సూచిస్తున్నారు.