ఏపీలో మరో సంచలన సర్వే: వైసీపీ, టీడీపీ,జనసేనకి ఎన్ని సీట్లో తెలుసా?

ఆంధ్రప్రదేశ్‌లో మరికొన్ని రోజుల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.
మరోవైపు ఏపీ కాంగ్రెస్ వామపక్షాలతో కలిసి ఎన్నికలకు వెళ్లనున్నాయి. అయితే ప్రతిపక్షమైన తెలుగుదేశం, బీజేపీ, జనసేనలు కలిసి ఎన్నికలకు వెళ్లే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది… ఏ పార్టీ ఎన్నిసీట్లు సాధించబోతుంది అనే దానిపై అనేక అంచనాలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలిచేదెవరు? ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది..?ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదెవరు? జగన్ సర్కారును టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి కుప్పకూల్చుతుందా? అసలు ప్రజలు ఏం కోరుకుంటున్నారు? వైసీపీని ఆదరిస్తారా? లేక టీడీపీ-జనసేన కూటమిని ఆదరిస్తారా?అనే ప్రశ్నలు ప్రతీ ఒక్కరిని తొలచివేస్తున్నాయి. ఈ అంచనాలను పటా పంచలు చేస్తూ ఓ సర్వే విడుదలైంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమి అధికారంలోకి రావడం ఖాయంగా ఓ సర్వే ఫలితాలను వెల్లడించింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టడం ఖాయంగా తెలిపింది. ఏపీలో తాజా రాజకీయ పరిణామాలపై’పయనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేటు లిమిటెడ్ ‘టేటెస్ట్ సర్వేను విడుదల చేసింది. ఈ సర్వే ప్రకారం వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమి అధికారంలోకి రావడం ఖాయంగా స్పష్టం చేసింది.


టీడీపీ-జనసేనకే మెుగ్గు
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనేదానిపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్‌గా ఉండటం మరోవైపు తెలుగుదేశం, జనసేన పార్టీలు పొత్తులో భాగంగా కలిసి ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించడంతో ఆ కూటమి సైతం బలంగా ఉంది. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాలు దక్కించుకోబోతుంది అనేది ఉత్కంఠ రేపుతోంది. ఎన్నికలకు రోజులు సమీపిస్తున్న తరుణంలో ఈ సీట్లపై అనేక అంచనాలు వినిపిస్తున్నాయి. అంతేకాదు అనేక సర్వేలు సైతం తమ సర్వే ఫలితాలను విడుదల చేస్తూ రాజకీయాన్ని కాస్తా మరింత హాట్ టాపిక్గా మారింది. 2024 ఎన్నికల్లో ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమి 104 స్థానాల్లో గెలుపొందడం ఖాయం అని సర్వేలో స్పష్టం చేసింది. ఇకపోతే అధికార వైసీపీ కేవలం 49 సీట్లకే పరిమితం కాబోతుందని తెలిపింది. మిగిలిన 22 నియోజకవర్గాల్లో నువ్వా-నేనా అన్నట్టుగా గట్టి పోటీ ఉంటుందని స్పష్టం చేసింది.

పార్లమెంట్ ఎన్నికల్లోనూ కూటమిదే హవా
ఇదిలా ఉంటే ఏపీలో 25 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. లోక్‌సభ స్థానాల విషయానికి వస్తే టీడీపీ-జనసేన కూటమి 18 స్థానాలను కైవసం చేసుకుంటుందని ‘పయనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేటు లిమిటెడ్ ‘ సర్వే వెల్లడించింది. ఇకపోతే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 7 స్థానాలకే పరిమితం కాబోతుందని తెలిపింది. గత ఎన్నికల్లో వైసీపీ 22 లోక్‌సభ స్థానాల్లో గెలుపొందింది. అయితే 2024 ఎన్నికల్లో ఆ సంఖ్య కేవలం 7 స్థానాలకే పరిమితం కాబోతుందని ‘పయనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేటు లిమిటెడ్ ‘స్పష్టం చేసింది.ఓట్ షేరింగ్‌లో భారీ మార్పు
తెలుగుదేశం-జనసేన కూటమికి వచ్చే ఎన్నికల్లో భారీ ఓట్ షేరింగ్ పెరగడం ఖాయమని ‘పయనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేటు లిమిటెడ్ ‘సంస్థ తన సర్వేలో తెలిపింది. ఈ కూటమికి 51.4 శాతం ఓట్లు పడతాయని వెల్లడించింది. మరోవైపు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 42.6 శాతం ఓట్లు మాత్రమే పడతాయని తేల్చింది. మరోవైపు ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ శాతం కూడా అనూహ్యంగా పెరిగే అవకాశం ఉందని తెలిపింది. కాంగ్రెస్ ఓటింగ్ షేర్ 3 శాతంకు పెరుగుతుందని తెలిపింది. మరోవైపు బీజేపీకి 1.3 శాతం, ఇతర పార్టీలు( సీపీఎం, సీపీఐ, బీఎస్పీ, బీసీవై, జై భారత్ నేషనల్) 1.4 శాతం ఓట్లు పడతాయని స్పష్టం చేసింది.

గత నెలలోనే శాంపిల్స్ సేకరణ
ఈ ఏడాది ఫిబ్రవరి 15వరకు ఈ సర్వే చేపట్టినట్లు’పయనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేటు లిమిటెడ్ ‘సంస్థ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో సర్వే చేపట్టినట్లు తెలిపింది. మెుత్తం 53,000 మంది షాంపిల్స్ సేకరించినట్లు వెల్లడించింది. ఇకపోతే ఈ సర్వేలో పాల్గొన్నవారిలో 54 శాతం మంది పురుషులు, 46 శాతం మహిళలు ఉన్నట్లు ‘పయనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేటు లిమిటెడ్ ‘వెల్లడించింది.