పోస్టాఫీస్ సూపర్ స్కీమ్ – రోజుకు రూ.50 పొదుపు చేస్తే చేతికి రూ.30లక్షలు! –

Post Office Gram Suraksha Yojana : సాధారణంగా ఎవరైనా భవిష్యత్తు కోసం మంచి లాభాలు అందించే పొదుపు పథకాలలో పెట్టుబడి పెట్టాలని కోరుకుంటారు. అదే టైమ్​లో రెగ్యులర్ ఆదాయంతో తక్కువ రిస్క్ ఉండే స్కీమ్స్​లో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే చాలా మంది కేంద్ర ప్రభుత్వ మద్దతు ఉండే పోస్టాఫీస్(Post Office) అందించే పొదుపు పథకాలలో పెట్టుబడులు పెడుతుంటారు. అందులో ఓ పథకమే.. “గ్రామ సురక్ష యోజన(Gram Suraksha Yojana)”. దీంట్లో రోజూ రూ.50 ఇన్వెస్ట్ చేస్తే.. మెచ్యూరిటీ నాటికి రూ.30లక్షలు అందుకోవచ్చు. ఇంతకీ, ఈ పథకంలో చేరడానికి ఎవరు అర్హులు? మెచ్యూరిటీ పీరియడ్ ఎంత? ఎలా చేరాలి? వంటి పూర్తి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.


అర్హతలు :

ఇండియన్ పోస్టాఫీస్ అందిస్తున్న.. గ్రామ సురక్ష యోజన స్కీమ్ కేవలం పొదుపు పథకమే మాత్రమే కాకుండా.. హెల్త్ అండ్ లైఫ్ అష్యూరెన్స్ పాలసీ కూడా. దీనిని 1995లో గ్రామీణ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ ప్రోగ్రామ్‌లో భాగంగా.. దేశంలోని గ్రామీణ ప్రాంత ప్రజల కోసం తపాలా శాఖ ప్రారంభించింది. ఈ పథకంలో 19 నుంచి 55 సంవత్సరాల మధ్య వయసు ఉన్న భారతీయులెవరైనా పెట్టుబడి పెట్టవచ్చు. ఈ స్కీమ్​కు సంబంధించిన ప్రీమియం చెల్లించడానికి వివిధ ఆప్షన్లు ఉన్నాయి. అంటే.. నెలవారీగా, మూడు నెలల ప్రాతిపదికన, 6 నెలలకు ఓసారి, సంవత్సరానికి ఒకసారి ఇలా ఎప్పుడైనా ప్రీమియం డబ్బుల్ని చెల్లించవచ్చు.

ప్రీమియం చెల్లింపు వివరాలు :

గ్రామ సురక్ష యోజన స్కీమ్ మెచ్యూరిటీ పీరియడ్ 55 ఏళ్లు, 58 సంవత్సరాలు, 60 ఏళ్లు.. ఇలా ఉంటుంది. మీ వయసును బట్టి ప్రీమియం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి 19 సంవత్సరాల వయసులో రూ.10 లక్షల ప్రీమియం సెలెక్ట్ చేసుకుంటే.. అతను 55 ఏళ్లు వచ్చే వరకు నెలకు రూ.1,515 లను ప్రీమియంగా చెల్లించాల్సి ఉంటుంది. అంటే రోజకు 50 రూపాయలన్నమాట. అదే.. అతను 58 సంవత్సరాల వరకు పెట్టుబడి పెట్టాలని అనుకుంటే.. అప్పుడు నెలకు రూ.1,463 ప్రీమియం చెల్లించాలి. 60 సంవత్సరాల వరకైతే రూ.1,411 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.

రాబడి ఎలా వస్తుందంటే?

ఈ పథకంలో మీరు ఎన్ని సంవత్సరాలు ఇన్వెస్ట్ చేశారనే దాన్ని బట్టి.. మీకు వచ్చే రాబడి ఉంటుంది. మీరు.. 19 ఏళ్ల వయసు నుంచి 55 ఏళ్ల వరకు స్కీమ్‌లో పెట్టుబడి పెడితే మీకు రూ.31.60 లక్షలు తిరిగి వస్తాయి.
అదే.. 19 నుంచి 58 ఏళ్ల వరకు పెట్టుబడి పెడితే 33.40 లక్షలు, 60 ఏళ్ల వరకైతే రూ.34.60 లక్షలు మెచ్యూరిటీ సమయంలో వస్తాయి.
ఈ మెచ్యూరిటీ సొమ్ము 80 ఏళ్లు నిండిన తర్వాత అందుతుంది.
ఒకవేళ పాలసీదారుడు మధ్యలో మరణిస్తే.. మీ స్కీమ్, అప్పటి వరకూ చెల్లించిన ప్రీమియం ఆధారంగా నామినీకి చెల్లిస్తారు.
ఈ స్కీమ్‌ను ప్రారంభించిన మూడు సంవత్సరాల తరవాత పాలసీదారుడు స్వచ్ఛందంగా దీన్ని నిలిపేయవచ్చు.
ఈ స్కీమ్​లో బోనస్‌ కూడా ఉంటుంది. అంటే.. మీరు డిపాజిట్ చేసే ప్రతి వెయ్యి రూపాయలకు సంవత్సరానికి రూ.60 బోనస్ వస్తుంది.
ఎలా చేరాలంటే?

మీ సమీపంలోని పోస్టాఫీసు వద్దకు వెళ్లి ఈ స్కీమ్ గురించి అడిగి తెలుసుకోండి. ఆ తర్వాత సంబంధిత అప్లికేషన్‌ ఫారమ్‌ నింపి, అవసరమైన డాక్యుమెంట్స్ జతచేసి అధికారులకు ఇవ్వండి.