Lifestyle: భోజనం చేయగానే పండ్లు తింటున్నారా.? నిపుణులు ఏమంటున్నారంటే..

ఆరోగ్యానికి పండ్లు ఎంతో మేలు చేస్తాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే వైద్యులు సైతం పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా సీజన్‌లో లభించే పండ్లను తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుందని చెప్తారు. అయితే పండ్లను తీసుకునే సమయంలో కొన్ని నియమాలు పాటించాలని మీకు తెలుసా.? మనలో చాలా భోజనం చేయగానే పండ్లను తీసుకుంటారు. మరి ఇలా తీసుకోవడం వల్ల ఏమైనా నష్టం ఉంటుందా.? అసలు పండ్లను ఎప్పుడు తినాలి లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..


పండ్లను భోజనానికి అరగంట ముందు తింటే శరీరానికి పుష్కలంగా పోషకాలు అందుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అదే భోజనం తర్వాత పండ్లను తింటే, పండ్లలోని అదనపు కేలరీలు ఆహారంతో పాటు శరీరంలోకి వెళ్తాయని, ఇది ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. అలాగే రాత్రి పడుకునే ముందు ఉదయం లేవగానే పండ్లను తీసుకోకూడదని చెబుతున్నారు. మధ్యాహ్నం, సాయంత్రం పండ్లను తీసుకోవడానికి బెస్ట్‌ సమయంగా చెబుతున్నారు.

భోజనం చేయగానే ఎట్టి పరిస్థితుల్లో పండ్లను తీసుకోకూడదు. దీనికి కారణం భోజనం చేయగానే శరీరంలో కేలరీలు ఉంటాయి. తీసుకున్న ఆహారం జీర్ణమయ్యే కంటే ముందే మళ్లీ పండ్లను తీసుకుంటే.. జీర్ణ వ్యవస్థపై రెట్టింపు భారం పడుతుంది. దీంతో జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అజీర్ణం, ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. భోజనం చేసిన వెంటనే ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో అనేక రకాల టాక్సిన్స్ పేరుకుపోతాయని చెబుతున్నారు. దీని ప్రభావం పొట్టపైనే కాదు చర్మంపై కూడా కనిపిస్తుంది.

భోజనం చేసే కంటే కనీసం రెండు గంటల ముందు లేదా భోజనం చేసిన 2 గంటల తర్వాత పండ్లను తీసుకోవడం బెస్ట్‌ అని చెబుతున్నారు. ఇక ఉదయం 10 నుంచి 12 గంటల మధ్య పండ్లను తీసుకోవాలని చెబుతున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల మధ్య పండ్లను తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని చెబుతున్నారు.